న్యూఢిల్లీ: అగ్రస్థాయి క్రీడాకారులకు చేయూత అందించినందుకు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కృతజ్ఞతలు తెలిపారు. అగ్ర క్రీడాకురులకే కాకుండా ముందుకు వస్తున్న క్రీడాకారులకు కూడా ప్రభుత్వం సహాయం చేస్తే బాగుంటుందని ఆమె అన్నారు. ప్రభుత్వం శుక్రవారంనాడు ఆమెకు 25 లక్షల నగదు బహుమతిని అందించింది.
అంతర్జాతీయ ఈవెంట్స్లో పాల్గొంటున్న ఆటగాళ్ల పేర్లను ప్రభుత్వ పథకాల్లో చేరిస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. క్రీడాకారులకు ప్రభుత్వం ఇతోధిక సాయం చేస్తోందని ఆమె అన్నారు.

మరిన్ని టైటిల్స్ గెలుచుకోవాలని ఉందని హైదరాబాద్కు చెందిన సైనా నెహ్వాల్ అన్నారు. అత్యుత్తమంగా ఆడడమే తన బాధ్యత అని, ఈ ఏడాది పలు అద్భుతాలు జరిగాయని, వీటిని తాను ఊహించలేదని సైనా అన్నారు.
తాను చాలా ఉద్వేగభరితమైన వ్యక్తినని, ఎల్లవేళలా అగ్రస్థానంలో కొనసాగడం అంత సులభం కాదని ఆమె అన్నారు. ఫిట్నెస్తో ఉండడమే అత్యంత కీలకమైందని, దాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నానని ఆమె అన్నారు. జీవితంలో ఎగుడుదిగుడులు సహజమని అన్నారు. గాయపడకుండా కాపాడుకోవడం ఎలా అనేది సవాల్ అని ఆమె అన్నారు.