హైదరాబాద్: తనకు పద్మ అవార్డు రాకపోవడంపై గుత్తా జ్వాలా అసంతృప్తి వ్యక్తం చేసింది. బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి అయిన జ్వాలకు ఇప్పటిదాకా పద్మ అవార్డు రాలేదు. బుధవారం అవార్డులను ప్రకటించారు. జ్వాలాకు అవార్డు రాలేదు.
దీనిపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను పదహేనేళ్లుగా దేశం కోసం ఆడుతున్నానని, ఎన్నో ప్రతిష్టాత్మక టోర్నీల్లో సత్తా చాటానని, అయినా తనకు పురస్కారం దక్కలేదని చెప్పారు. తాను ఇప్పటికే మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు.
అయినా కావాలనే విస్మరించారన్నారు. అన్ని అర్హతలు ఉన్నాయన్న భావనతోనే పద్మ అవార్డులకు దరఖాస్తు చేశానని, కాన అవి వారికి సరిపోలేదన్నారు. పద్మ అవార్డులు రావాలంటే రికమెండేషన్ కావాలా అని అడిగారు.
రెకమెండేషన్ ఉంటేనే అవార్డుకు ఎంపిక చేస్తామనేటప్పుడు దరఖాస్తులను ఎందుకు ఆహ్వానించాలని ప్రశ్నించారు. తాను సాధించిన విజయాలు పద్మ పురస్కారానికి సరిపోవా? అని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళల డబుల్స్లో తాను అందరికీ మార్గదర్శకంగా నిలిచానని చెప్పారు. తాను ముక్కుసూటిగా ఉండటం వల్లే తనకు అవార్డును నిరాకరిస్తున్నారని చెప్పారు. తాను ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్, గ్లాస్గోలో సిల్వర్ మెడల్స్ను వరుసగా సాధించానని చెప్పారు.
కాగా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణుల్లో సైనా నెహ్వాల్, పీవీ సింధూలకు, టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు పద్మ అవార్డులు వచ్చాయి.
సైనా, సింధూ, సానియా, గుత్తా జ్వాలా పొందిన అవార్డులు..
సైనా నెహ్వాల్ : అర్జున(2009), పద్మశ్రీ(2010), రాజీవ్ గాంధీ ఖేల్రత్న(2009-10), పద్మ భూషణ్(2016)
సానియా మీర్జా : అర్జున(2004), పద్మశ్రీ(2006), రాజీవ్ గాంధీ ఖేల్రత్న(2015), పద్మ భూషణ్(2016)
పీవీ సింధు: అర్జున(2013), పద్మశ్రీ(2015), రాజీవ్ గాంధీ ఖేల్రత్న(2016)
గుత్తా జ్వాల : అర్జున(2011)