న్యూఢిల్లీ: భారత బాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్పై క్రీడాకారిణి జ్వాలా గుత్తా తీవ్రంగా ధ్వజమెత్తారు. తనపై బాయ్ ప్రతిపాదించిన జీవిత కాలం నిషేధంపై గోపీచంద్ ఎందుకు నోరు విప్పడం లేదని ఆమె అడిగారు. తనపై బాయ్ ప్రతిపాదించిన నిషేధంపై గోపీచంద్ మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆమె అన్నారు.
మాజీ కోచ్లు ఆరిఫ్, విమల్ బహిరంగంగా మాట్లాడారని, విమల్ బంగా బీట్స్ కోచ్గా వ్యవహరించారని, విమల్ కూడా ప్రకటన చేశారని, వారు మాట్లాడినప్పుడు గోపీచంద్ ఎందుకు మాట్లాడడం లేదని ఆమె అన్నట్లు పిటిఐ వార్తా సంస్థ తన కథనంలో తెలిపింది.

గోపీచంద్ తన అకాడమీకి మాత్రమే కోచ్గా వ్యవహరిస్తున్నారా, మొత్తం దేశానికి కోచ్గా వ్యవహరిస్తున్నారా అని జ్వాలా అడిగారు. జ్వాలా నువ్వు చేసింది తప్పని గోపీచంద్ చెప్పవచ్చునని, ఓ వైఖరి తీసుకోవాలని, ఎందుకు మాట్లాడడం లేదని ఆమె అన్నారు.
హైదరాబాద్కు చెందిన జ్వాలా గుత్తా ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్లో ఆడడానికి ప్యారిస్లో ఉంది. వివాదం తన ఆటపై ప్రభావం చూపబోదని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. తాను కూడా మానవమాత్రురాలినే అని, తనను బాధిస్తుందని, ఇవన్నీ తన తలలో ఉన్నాయని ఆమె అన్నారు. వేధింపులకు గురవుతామనే భయంతో ఇతర ఆటగాళ్లు బహిరంగంగా తనకు మద్దతు పలకడం లేదని జ్వాలా అన్నారు.