న్యూఢిల్లీ: వరుసగా రెండో ఏడాది తన పేరును అర్జున అవార్డుకు సిఫార్సు చేయకపోవడంతో.. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)పై విమర్శలు గుప్పించిన స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ ఎట్టకేలకు వెనక్కు తగ్గాడు. బాయ్కు ప్రణయ్ క్షమాపణ చెప్పాడు. ప్రణయ్ క్షమాపణలు చెప్పగా.. మరోసారి ఇలాంటి తప్పులు చేయొద్దని బాయ్ ప్రెసిడెంట్ హిమాంత బిశ్వా శర్మ, సెక్రటరీ అజయ్ సూచించారు.
ఈ ఏడాది అర్జున అవార్డు ప్రతిపాదనకు ఎంపిక చేసిన వారి జాబితాలో హెచ్ఎస్ ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్ పేర్లను భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ పక్కనబెట్టింది. క్రమశిక్షణ ఉల్లంఘన కారణాలతో వరుసగా రెండో ఏడాది కూడా ఈ ఇద్దరిని పక్కనబెట్టిన బాయ్.. యువ ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి, సమీర్ వర్మల పేర్లను అర్జునకు నామినేట్ చేసింది.
దీంతో బాయ్పై ప్రణయ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. 'మళ్లీ అదే పాత కథ. ప్రతిభ గల ఆటగాడికి మరోసారి అన్యాయం జరిగింది' అంటూ వరుసగా ట్వీట్లు చేశాడు. ప్రణయ్ క్రమశిక్షణరాహిత్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాయ్.. షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై సరైన వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
బాయ్ ఈ నెల 2న ముగ్గురు షట్లర్ల పేర్లని అర్జున అవార్డుకి సిఫార్సు చేయగా.. అందులో ప్రణయ్ పేరు లేకపోవడంతో జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ స్వయంగా ప్రణయ్ పేరుని సిఫార్సు చేసారు. చీఫ్ కోచ్గా కాకుండా.. రాజీవ్ గాంధీ ఖేల్రత్న హోదాలో అతను సిఫార్సు చేశారు. తన పేరును అర్జున అవార్డుకు సిఫార్సు చేసిన నేపథ్యంలో బాయ్కు ప్రణయ్ క్షమాపణలు చెప్పాడు. అతడి క్షమాపణల్ని బాయ్ అధ్యక్షుడు హిమంత ఆమోదించడంతో వివాదానికి తెరపడింది.
భారత క్రీడారంగంలో డోపింగ్ కలకలం.. పట్టుబడ్డ 22 మంది రోయర్లు!!