హైదరాబాద్: యుఎస్ ఓపెన్ గ్రాండ్ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేతగా హెచ్ఎస్ ప్రణయ్ అవతరించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ పైనల్లో కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక మాజీ విజేత పారుపల్లి కశ్యప్పై అతడు విజయం సాధించాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో కశ్యప్పై 21-15, 20-22, 21-12 తేడాతో ప్రణయ్ విజయం సాధించాడు.

ప్రణయ్కి ఇది మూడో గ్రాండ్ ప్రి టైటిల్ కావడం విశేషం.సుమారు 65 నిమిషాల పాటు జరిగిన పోరులో ప్రణయ్ 21-15, 20-22, 21-12తో కశ్యప్పై విజయం సాధించాడు. మ్యాచ్ అనంతరం ప్రణయ్, కశ్యప్ ట్విటర్ ద్వారా తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.
'యుఎస్ ఓపెన్ గ్రాండ్ప్రి గోల్డ్-2017 టోర్నీ విజేతగా నిలవడం ఎంతో ఆనందంగా ఉంది. అకాడమీలో నాతో పాటు శిక్షణ పొందుతోన్న పారుపల్లి కశ్యప్పై విజయం సాధించాను. నాకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు' అని ప్రణయ్ పేర్కొన్నాడు.
'యుఎస్ ఓపెన్-2017 టోర్నీ రన్నరప్గా నిలిచాను. ఈ వారం నా ప్రదర్శన పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. విజేతగా నిలిచిన ప్రణయ్కి శుభాకాంక్షలు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, గోపీ చంద్, భారత ప్రభుత్వానికి, జాతీయ క్యాంపులో నాకు శిక్షణ ఇచ్చిన కోచ్లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులోనూ మీ మద్దతు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా' అని కశ్యప్ పేర్కొన్నాడు.
ఓ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్కు చెందిన ఇద్దరు షట్లర్లు ఫైనల్లో తలపడం ఇది రెండోసారి. గాయం నుంచి కోలుకొని ఇటీవలే మళ్లీ రాకెట్ పట్టిన కామన్వెల్త్ క్రీడల చాంపియన్ కశ్యప్ దాదాపు రెండేళ్ల తర్వాత ఓ టోర్నీలో ఫైనల్ చేరాడు. ఇక గతేడాది స్విస్ ఓపెన్లో రన్నరప్గా నిలిచిన ప్రణయ్కిది ఈ ఏడాదిలో తొలి ఫైనల్.