హాంకాంగ్ ఓపెన్లో భారత మహిళల డబుల్స్ టీం ముందంజ వేసింది. తనీషా క్రాస్టో, అశ్వినీ పొన్నప్ప జోడీ చక్కని ఆటతో ప్రీక్వార్టర్స్ చేరుకుంది. ఈ టోర్నీ కౌలూన్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. బుధవారం నాడు జరిగిన మొదటి రౌండ్లో అశ్వినీ జోడీ పైచేయి సాధించింది. చైనాకు చెందిన లీ చియూ, టెంగ్ చెన్ ఇద్దరన్నీ మట్టికరిపించింది.
నువ్వా? నేనా? అన్నట్లు ఈ రెండు టీమ్స్ పోటీ పడటంతో విజేత ఎవరో ముందుగా ఎవరూ చెప్పలేకపోయారు. అయితే చివరకు 21-19, 21-19 తేడాతో వరుసగా రెండు సెట్లు నెగ్గిన అశ్వినీ జోడీ ప్రీక్వార్టర్స్లో అడుగు పెట్టింది. వచ్చే మ్యాచులో భారత జోడీ.. జపాన్ టీంతో తలపడుతుంది. ఆ మ్యాచ్ గెలిస్తే అశ్వినీ, తనీషా జోడీ క్వార్టర్స్ చేరుకుంటుంది.

మొదటి రౌండ్లో ఆధిత్యం చెలాయించిన అశ్వినీ జోడీకి రెండో రౌండ్లో పెద్ద అడ్డంకి ఉంది. ఈ మ్యాచ్లో వాళ్లు టాప్సీడ్ జపాన్ జంట మయు, వకానాతో తలపడాల్సి ఉంటుంది. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ దురదృష్టవశాత్తూ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. వెన్ను నొప్పితో బాధ పడిన అతను.. టోర్నీ నుంచి తపపుకున్నాడు.
అదే సమయంలో మరో కీ ప్లేయ్ ప్రియాన్షు రజావత్ ఈ టోర్నీలో ముందడుగు వేయలేకపోయాడు. జపాన్కు చెందిన సునెయామాతో జరిగిన మ్యాచులో 13-21, 14-21 తేడాతో ప్రియాన్షు వరుస సెట్లు ఓడి మ్యాచ్ చేజార్చుకున్నాడు. అలాగే మహిళల సింగిల్స్ విభాగంలో కూడా భారత్కు శుభారంభం దక్కలేదు. ఈ విభాగంలో బరిలో దిగిన ఆకర్షీ కశ్యప్ కూడా తొలి రౌండ్లోనే వెనుతిరిగింది.

జర్మనీ ప్లేయర్ వోనె లీతో జరిగిన మ్యాచులో 18-21, 10-21 స్కోరుతో ఆకర్షీ ఓటమిపాలైంది. అలాగే డబుల్స్ విభాగంలో కృష్ణప్రసాద్, విష్ణువర్ధన్ జోడీ కొరియాకు చెందిన కో సంగ్, షిన్ బేక్ జోడీ చేతిలో 14-21, 19-21 తేడాతో ఓడింది. మిక్స్డ్ డబుల్స్లో సుమిత్రెడ్ది, అశ్వినీ పొన్నప్ప ద్వయం 16-21, 21-16, 18-21 స్కోరుతో మలేషియా జంట టాంగ్, తో వీ చేతిలో ఓడింది. సిక్కిరెడ్డి, రోహన్ ద్వయం కూడా సింగపూర్కు చెందిన యాంగ్, టాన్ వీ చేతిలో 19-21, 10-21 స్కోరుతో ఓడి ఇంటిముఖం పట్టారు.