హాంకాంగ్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్కు మరోసారి చుక్కెదురైంది. ఇప్పటికే వరుస ఓటములను చవిచూస్తున్న సైనా మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది. హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన తొలి రౌండ్లో 9వ సీడ్ సైనా 13-21, 20-22తో కాయ్ యాన్ యాన్ (చైనా) చేతిలో ఓటమిపాలయింది. కేవలం 30 నిమిషాల్లోనే సైనా గేమ్లలో ఓడి టోర్నీ నుండి నిష్క్రమించింది.
తొలి డే/నైట్ టెస్ట్.. ఈడెన్లో గంట మోగించనున్న హసీనా, మమత!!
తొలి గేమ్లో చైనా క్రీడాకారిణి కాయ్ దూకుడు ప్రదర్శించడంతో ఏ దశలోనూ సైనా పోటీ ఇవ్వలేకపోయింది. రెండో గేమ్లో మాత్రం సైనా గట్టిపోటీ ఇచ్చింది. అయితే పట్టువిడవని కాయ్ చివరకు గేమ్తో పాటు మ్యాచ్ గెలుచుకుంది. గతవారం చైనా ఓపెన్లో తొలి రౌండ్లోనే సైనా ఇంటిదారి పట్టినవిషయం తెలిసిందే. అయితే సైనా చైనా ఓపెన్లోనూ కూడా కాయ్ చేతిలోనే ఓటమిని చవిచూసింది. సైనా తొలి రౌండ్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించడం ఈ సీజన్లో ఇది 8వ సారి.
భారత మరో స్టార్ షట్లర్ పీవీ సింధు హాంకాంగ్ ఓపెన్లో బుధవారం పోరాటం ప్రారంభించనుంది. ఇక పురుషుల సింగిల్స్లో సాయి ప్రణీత్, హెచ్ఎస్ ప్రణయ్, పారుపల్లి కశ్యప్, సమీర్ వర్మ పోటీ పడనున్నారు. పోటీ నుంచి టాప్ సీడ్ కెంటో నిషిమోట (జపాన్) తప్పుకోవడంతో కిడాంబి శ్రీకాంత్ నేరుగా ప్రిక్వార్టర్స్కు చేరుకున్నాడు.
మిక్స్డ్ డబుల్స్ భారత జోడీ రాంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్-అశ్వినీ పొన్నప్ప శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో సాత్విక్ జోడీ 16-21, 21-19, 21-17తో నిపిత్పోన్-సావిత్రీ అమిత్రాపాయ్ (థాయ్లాండ్)పై విజయం సాధించి ప్రిక్వార్టర్స్కు చేరింది. 55 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ తొలి గేమ్లో భారత జోడీ వెనుకబడినా.. ఆ తర్వాత పుంజుకుని సత్తాచాటింది. క్వాలిఫయింగ్ రౌండ్లో రెండు విజయాలతో భారత యువ షట్లర్ సౌరభ్ వర్మ హాంకాంగ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు.