హైదరాబాద్: హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరిస్ 500 టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్, రియో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం(నవంబర్ 14)న జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో థాయిలాండ్కు చెందిన నిచ్సాన్ జిండాల్పై పోరాడి విజయం సాధించింది.
టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన భారత క్రికెటర్లు వీరే
ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో ఉన్న పీవీ సింధు నిచ్సాన్ జిండాల్పై 21-15, 13-21, 21-17 తేడాతో విజయం సాధించింది. సింధు చేతిలో నిచ్సాన్ జిండాల్కు ఇది నాలుగో ఓటమి కావడం విశేషం. తాజా విజయంతో పీవీ సింధు రెండో రౌండ్లోకి అర్హత సాధించింది.
టోర్నీలో భాగంగా పీవీ సింధు రెండో రౌండ్లో కొరియాకు చెందిన సుంగ్ జీ హుయాన్తో తలపడనుంది. రెండో రౌండ్లో పీవీ సింధు గనుక విజయం సాధిస్తే క్వార్టర్స్లో చైనాకు చెందిన హిబింజియోతో తలపడాల్సి ఉంటుంది. ఈ ఏడాది బింజియో చేతిలో సింధు ఇప్పటికే మూడు సార్లు ఓడిపోవడం విశేషం.
ఈ ఏడాది జులైలో ఇండోనేషియా ఓపెన్, అక్టోబర్లో ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీల్లో బింజియో చేతిలో పీవీ సింధు ఓడిపోయిన సంగతి తెలిసిందే. మూడో సీడ్ సింధు ఈ సీజన్లో మూడు పతకాలను గెలిచింది. కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్పిప్, ఆసియా గేమ్స్లో సింధు కాంస్య పతకాలను నెగ్గిన సంగతి తెలిసిందే.
క్వాలిఫయంగ్ రౌండ్లో పారుపల్లి కశ్యప్ గెలుపు
మాజీ వరల్డ్ నెంబర్-6 పారుపల్లి కశ్యప్ క్వాలిఫయంగ్ రౌండ్లో శుభారంభం చేశాడు. మంగళవారం ఇక్కడ ప్రారంభమైన ఈ టోర్నీ క్వాలిఫయింగ్ రౌండ్లో కశ్యప్ చైనా తైపీ క్రీడాకారుడు షు జెన్ హావోపై 21-7, 12-21, 21-18 తేడాతో విజయం సాధించాడు. దీంతో మెయిన్ డ్రాలో ఇండోనేషియా షట్లర్, ఏడో సీడ్ ఆంధోనీ సినిసుకా జింటింగ్తో కశ్యప్ తలపడనున్నాడు.
కాగా, ఇదే టోర్నీలోని మిక్సిడ్ డబుల్స్ ఓపెనింగ్ రౌండ్ మెయిన్ డ్రాలో సాత్విక్రాజ్ రంకిరెడ్డి-అశ్విని పొన్నప్ప చైనీస్ తైపీ జోడీ వాంగ్ చి లిన్-లీ చియా సిన్లపై 21-16, 19-21, 21-14 తేడాతో విజయం సాధించారు. ఈ భారత జోడీ తమ తదుపరి రౌండ్లో తైవాన్ జోడీ లీ యాంగ్- యా చింగ్తో తలపడనున్నారు.