హాంకాంగ్: భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు మళ్లీ నిరాశపరిచింది. హాంకాంగ్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నమెంట్లో రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ప్రపంచ చాంపియన్, ఆరో సీడ్ సింధు 18-21, 21-11, 16-21తో తనకంటే దిగువ ర్యాంకులో ఉన్న బుసానన్ ఒంగ్బామ్రుంగ్ఫాన్ (థాయ్లాండ్) చేతిలో పరాజయం పాలయింది.
నా కెరీర్లో ప్రపంచం ముగిసిందనుకున్నా.. మనస్సు సరిగ్గా లేనప్పుడు విరామం అవసరం: కోహ్లీ
సింధు 69 నిమిషాల పాటు పోరాడి ఓడింది. తొలి గేమ్లో 18-15తో ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థికి వరుసగా ఆరు పాయింట్లు సమర్పించుకున్న సింధు గేమ్ను కోల్పోయింది. రెండో గేమ్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించినా.. నిర్ణయాత్మక మూడో గేమ్లో వెనుకబడి మూల్యం చెల్లించుకుంది. మరోవైపు సైనా నెహ్వాల్ తొలి రౌండ్లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.
పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రపంచ 13వ ర్యాంకర్ శ్రీకాంత్ 21-11, 15-21, 21-19తో మన దేశానికే చేందిన సౌరభ్ వర్మపై గెలుపొందాడు. చివరిసారిగా ఏప్రిల్లో జరిగిన సింగపూర్ ఓపెన్లో కిడాంబి క్వార్టర్స్ చేరాడు. అయితే, రౌండ్-8లో ఒలింపిక్ చాంప్ చెన్ లాంగ్ రూపంలో శ్రీకాంత్కు కఠిన పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది.
హెచ్.ఎస్.ప్రణయ్, పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్స్లో ఓడిపోయారు. ప్రణయ్ 12-21, 19-21తో ఆరో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూడగా.. రెండో సీడ్ చౌతియెన్ చెన్ (చైనీస్ తైపీ) 12-21, 23-21, 21-10తో పారుపల్లి కశ్యప్పై చెమటోడ్చి గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో సాత్విక్ సాయిరాజ్-అశ్విని పొన్నప్ప జంట 19-21, 12-21తో నాలుగో సీడ్ యుత వతనబె-అరిస హిగషినొ జోడీ చేతిలో కంగుతింది.