
హైదరాబాద్: సైనా నెహ్వాల్, పీవి సింధు.. కిదాంబి శ్రీకాంత్.. కోలూన్ వేదికగా జరుగుతున్న హాంకాంగ్ ఓపెన్లో భారత షట్లర్లు వరుసగా ఇంటిబాట పడుతున్నారు. ఈ టోర్నీ తొలి రౌండ్లోనే సీనియర్ షట్లర్ సైనా నెహ్వాల్ పేలవంగా నిష్క్రమించింది. ఆ తర్వాత గురువారం తొలి రౌండ్ దక్కించుకున్నా.. రెండో రౌండ్లో మాత్రం చేతులెత్తేసిన పీవీ సింధు కూడా ఓటమిని చవిచూసింది.
ఇక మిగిలిన మూడో స్టార్ షట్లర్.. పురుషుల సింగిల్స్ విభాగంలో వరుసగా రెండు విజయాలతో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ క్వార్టర్ ఫైనల్స్లో కిదాంబి శ్రీకాంత్ కూడా శుక్రవారం ఓడిపోయాడు. జపాన్ షట్లర్ కెంటా నిషిమోతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో కిదాంబి శ్రీకాంత్ 17-21, 13-21 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు.
ఈ గేమ్ వైఫల్యంతో భారత్ టైటిల్ అవకాశాలన్నీ దాదాపు ముగిసిపోయినట్లేనని భావిస్తున్నారు. అయితే గాయం కారణంగా చైనా షట్లర్ చెన్ లాంగ్ గురువారం పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో క్వార్టర్స్కు చేరిన సమీర్ వర్మపైనే ఇక ఆశలన్నీ నిలబెట్టుకుంది భారత్.
టోర్నీలో భాగంగా గురువారం కిదాంబి శ్రీకాంత్... ప్రణయ్తో జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో 18-21, 30-29, 21-18 తేడాతో అతికష్టంగా గెలుపొందాడు. శుక్రవారం జరిగిన పోటీలో జపాన్ షట్లర్కి కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయాడు. తొలి సెట్ని చేజార్చుకున్న తర్వాత పూర్తిగా ఒత్తిడిలో పడిపోయిన శ్రీకాంత్.. రెండో సెట్లో వరుస తప్పిదాలతో ప్రత్యర్థికి అవకాశాలిచ్చేశాడు. దీంతో.. నిమిషాల వ్యవధిలోనే కెంటా తిరుగులేని స్థితికి చేరుకుని.. అలవోకగా మ్యాచ్ని చేజిక్కించుకున్నాడు.