విజయవాడ: జాతీయ క్రీడల్లో ఆయా రాష్ట్రాల తరఫున పాల్గొనే బ్యాడ్మింటన్ ప్లేయర్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో అర్థం కావడం లేదని స్టార్ షట్లర్ గుత్తా జ్వాలా శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పాల్గొనేందుకు ఆమె విజయవాడలో ఉన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. టోర్నమెంటులో మహారాష్ట్రకు చెందిన కొందరిని తెలంగాణ తరఫున ఆడిస్తున్నారని, సీనియర్నైన తాను హైదరాబాదులోనే ఉన్నా జట్టుకు సంబంధించి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. అకాడమీ నిర్వాహకుడిగా ఉన్న గోపీచంద్కే భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్గా, జట్టు ఎంపిక కమిటీ సభ్యుడిగా ఇన్ని బాధ్యతల అవసరం ఉందా అని ప్రశ్నించారు.
క్రీడల్లో రాజకీయాలు ఎక్కువయ్యాయని, వివక్ష కూడా ఉందని, దీంతో తమ పిల్లలు ఈ మార్గంలోకి వస్తుంటే తల్లిదండ్రులు అడ్డుకునే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఆటను చూసి కాకుండా తమ మాట వినే వారిని జట్టుకు ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. తాను మరి కొన్నాళ్లు మాత్రమే ఆడుతానని, భావితరం క్రీడాకారుల కోసమే తాను మాట్లాడుతున్నానని చెప్పారు.
కాగా, జాతీయ క్రీడలకు ఎంపిక చేసిన తెలంగాణ బ్యాడ్మింటన్ జట్టులో తనకు చోటు కల్పించకపోవడంతోపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తనను కాదని ఒక పశ్చిమ బెంగాల్ క్రీడాకారిణిని ఎంపిక చేశారని ఆమె ట్విట్టర్లో పేర్కొంది.
'తెలంగాణ జట్టులో బెంగాలీ ప్లేయర్కు స్థానం లభించినట్లు తెలిసింది. హైదరాబాద్కు చెందిన నన్ను ఎందుకు ఎంపిక చేయలేదో ఆశ్చర్యంగా ఉంది. తరుణ్, సిక్కిరెడ్డిలకు కూడా చోటు దక్కలేదంటే అసలు ఎవరు ఆడుతున్నారో అర్థం కావడం లేదు' అని గుత్తా జ్వాల వ్యాఖ్యానించింది.
అంతేగాక 'ఒక బెంగాలీ అమ్మాయి తెలంగాణకు ఆడుతుందా? మేమంతా బతికే ఉన్నాం కదా' అని జ్వాల కాస్త ఘాటుగానే స్పందించింది. జట్టును ఎవరు ఎంపిక చేస్తున్నారో తెలియడం లేదని పేర్కొంది.