హైదరాబాద్: హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా జాతీయ క్రీడలకు తనను ఎంపిక చేయకపోవడాన్ని తప్పు పట్టిన విషయం తెలిసిందే. వారం రోజుల క్రితం తనకు చోటులో దక్కనుందుకు ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. తాజాగా.. ఏం జరుగుతోందంటూ ఓ ఆంగ్ల పత్రికతో చెప్పారు.
తనకు అసోసియేషన్ నుండి ఓ మెయిల్ వచ్చిందని, తెలంగాణ తరఫున ఆడతావా అని ప్రశ్నించిందని పేర్కొన్నారు. అప్పుడు తనకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదన్నారు. తాను దేశం తరఫున ఆడానని, తాను తెలంగాణకు చెందిన వ్యక్తిని అని, హైదరాబాదులో ఉంటున్నానని చెప్పారు. ఇది తెలిసినా అడిగిన వారికి ఏం చెప్పాలని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను తన రాష్ట్రం తరఫున ఆడేందుకు ఆసక్తిగానే ఉన్నానా అని ప్రశ్నించడాన్ని ఆమె తప్పుపట్టారు. ఒకవేళ వారు యువతకు చోటు ఇస్తామని భావిస్తే, దానిని తాను అర్థం చేసుకోగలనన్నారు. తనకు ఈ విషయాన్ని ఒక్క ఫోన్ కాల్ చేసి చెబితే, తప్పుకుంటాను కదా అన్నారు.
కానీ, తాను ట్విట్టర్ ద్వారా ప్రశ్నించిన తర్వాతనే తనకు ఫోన్లు వచ్చాయని చెప్పారు. దీని పైన పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ.. గుత్తా జ్వాలా ఆడాలనుకుంటే, అందుకు సిద్ధమేనని చెప్పారు.
కాగా, జాతీయ క్రీడలకు ఎంపిక చేసిన తెలంగాణ బ్యాడ్మింటన్ జట్టులో తనకు చోటు కల్పించకపోవడంతోపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తనను కాదని ఒక పశ్చిమ బెంగాల్ క్రీడాకారిణిని ఎంపిక చేశారని ఆమె ట్విట్టర్లో పేర్కొంది.
'తెలంగాణ జట్టులో బెంగాలీ ప్లేయర్కు స్థానం లభించినట్లు తెలిసింది. హైదరాబాద్కు చెందిన నన్ను ఎందుకు ఎంపిక చేయలేదో ఆశ్చర్యంగా ఉంది. తరుణ్, సిక్కిరెడ్డిలకు కూడా చోటు దక్కలేదంటే అసలు ఎవరు ఆడుతున్నారో అర్థం కావడం లేదు' అని గుత్తా జ్వాల వ్యాఖ్యానించింది.
అంతేగాక 'ఒక బెంగాలీ అమ్మాయి తెలంగాణకు ఆడుతుందా? మేమంతా బతికే ఉన్నాం కదా' అని జ్వాల కాస్త ఘాటుగానే స్పందించింది. జట్టును ఎవరు ఎంపిక చేస్తున్నారో తెలియడం లేదని పేర్కొంది.