హైదరాబాద్: 2020లో టోక్యో ఆతిథ్యమిస్తోన్న ఒలింపిక్స్లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు స్వర్ణం సాధిస్తుందని తెలంగాణ గవర్నర్ నరసింహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన పీవీ సింధుతో పాటు పారా షట్లర్ మానసి జోషీని గవర్నర్ నరసింహాన్ దంపతులు బుధవారం సన్మానించారు.
టోక్యోలో స్వర్ణం నెగ్గి మీ ముందుంటాను: రాజ్భవన్ సన్మాన కార్యక్రమంలో సింధు
ఈ సందర్భంగా గవర్నర్ నరసింహాన్ మాట్లాడుతూ "రాజ్భవన్కు ఇదొక గొప్ప గర్వకారణం. రాజ్ భవన్ తెలంగాణలో జరుగుతున్న మొట్టమొదటి ఫంక్షన్ ఇది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత తన బంగారు కలను సాకారం చేసుకుంది. నీకు విరామం ఎప్పుడు లభిస్తుందంటే.. 2020 ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించినప్పుడే. వచ్చే ఏడాది నేను రాజ్భవన్లో ఉన్నా లేకపోయినా.. ఈ రాజ్ భవన్ ఆమెను సన్మానిస్తుంది. దీనిని నేను బలంగా నమ్ముతున్నా" అని అన్నారు.
ఇక, పారా బ్యాడ్మింటన్ టోర్నీలో స్వర్ణం సాధించిన మానసి జోషీపై కూడా గవర్నర్ నరసింహాన్ ప్రశంసలు వర్షం కురిపించారు. "మానసి అంటే అర్ధం తెలివైన మైండ్ ఉన్న అమ్మాయి అని. నువ్వు మా అందరికీ రోల్ మోడల్. నీ జీవితంలో నువ్వు ఏదైతే సాధించావో దానికి అభినందిస్తున్నాను" అని అన్నారు. స్వర్ణాలు సాధించిన సింధు, మానసిలకు అభినందనలు తెలిపిన అయన వారి విజయం దేశానికి గర్వకారణమని అన్నారు.
వేటు పడింది..: యాషెస్లో నాలుగు, ఐదు టెస్టులకు అంఫైర్లు మార్పు
ఇక, కోచ్ గోపీచంద్ మాట్లాడుతూ "సింధు విజయంలో తన కష్టం, తన శిక్షణతో పాటు కోచ్ కిమ్ శ్రమను అభినందించాలి. నా బంగారు కలను నిజం చేసినందుకు సింధుకి కృతజ్ఞతలు. పారా షట్లర్ మానసి జోషి శ్రమ, పట్టుదలకు ప్రతీక. ఒకేసారి రెండు గోల్డ్ మెడల్ గెలుచుకోవడం ఆనందాన్ని రెట్టింపు చేసింది" అని అన్నారు. కాగా, గోపిచంద్ను తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, కోచ్ పుల్లెల గోపీచంద్, పీవీ సింధు కుటుంబసభ్యులు, పలువురు క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు. 36 ఏళ్ల నిరీక్షణకు పీవీ సింధు తెరదించడంతో పాటు వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో స్వర్ణం నెగ్గిన తొలి మహిళ బ్యాడ్మింటన్ ప్లేయర్గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.