
హైదరాబాద్: కొద్ది రోజులుగా పీవి సింధు.. ఫైనల్ వరకూ వెళ్లడం అక్కడ ఓడిపోవడం తరచూ జరుగుతూనే ఉన్నాయి. అయితే వీటన్నిటిపై పీవీ సింధు ఛీప్ కోచ్ వివరణ ఇచ్చాడు. మీడియా ప్రచారం వల్ల తన ప్లేయర్ కుంగుబాటు లోనుకాకుండా ఉండేందుకు ముందుగానే స్పందించి ఆమె ఆటతీరు గురించి విశ్లేషించి చెప్పాడు.
'ఫైనల్లో సింధు ఆశించినట్లుగా ఆడలేకపోయింది. ఇంకా మెరుగ్గా ఆడాల్సింది. ఐతే రాత్రి ఆలస్యంగా మ్యాచ్లు ఆడటంతో చాలా ఒత్తిడి కూడా ఆమె ప్రదర్శనపై ప్రభావం చూపింది. నిజానికి ఈ ఫైనల్లో ఆమెకు ఏదీ కలిసి రాలేదు. టైటిల్ పోరుకు గత మ్యాచ్కు మధ్య విరామం కూడా తక్కువే.కోలుకోవడానికి సమయం ఉండాలి. ఈ ఏడాది అన్ని ఫైనల్స్లో పెద్ద సమస్యలా అనిపించట్లేదు. ప్రపంచ ఛాంపియన్షిప్లో వరుసగా రెండో ఫైనల్ చేరడం జోక్ కాదు.'
'ఇటీవల కాలంలో ఆమెకు ఎదురైన ఫైనల్స్ పరాజయాల్ని భూతద్దంలో చూడాల్సిన పనిలేదు. ఐతే ఫైనల్లో సింధు ఆశించినంతగా దూకుడు కనబరచలేదు. ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్ భిన్నమైన సవాల్. అందుకు తగ్గట్లే ఆడాలి. ఏదేమైనా సింధు గొప్పగా ఆడింది. స్వర్ణం చేజారినా... ఓవరాల్గా సింధు ప్రదర్శన బాగుంది. తర్వాత జరిగే టోర్నీల్లో మెరుగైన నియంత్రణ, ఆటపై పట్టు సాధించే అంశాలపై మేం దృష్టి సారిస్తాం.'
'మారిన్ అత్యుత్తమ క్రీడాకారిణి. మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలవడం, ఒలింపిక్స్లో స్వర్ణం గెలవడం అరుదైన ఘనత. బ్యాడ్మింటన్కు మారిన్ గొప్ప ప్రచారకర్త. టోర్నీలో రచనోక్పై సైనా నెహ్వాల్ విజయం భారత్కు సానుకూలాంశం. డబుల్స్ క్రీడాకారుల ఆట కూడా ఆకట్టుకుంది. ప్రణీత్ బాగా ఆడాడు. మొత్తంగా ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారుల ప్రదర్శన సంతృప్తినిచ్చింది' అని పేర్కొన్నాడు.