
హైదరాబాద్: 2020లో టోక్యో వేదికగా జరిగే ఒలంపిక్స్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు స్వర్ణాన్ని సాధిస్తారని జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ ధీమా వ్యక్తం చేశారు. జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్యూలో గోపీచంద్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా భారత షట్లర్లు మెరుగైన ఆటతీరును కనబరుస్తుటన్నట్లు చెప్పుకొచ్చారు.
2008 బీజింగ్ ఒలంపిక్స్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు తొలిసారిగా ఉత్తమ ప్రదర్శనను కనబరిచారని ఈ సందర్భంగా గోపీచంద్ గుర్తు చేశారు. 2012 లండన్ ఒలంపిక్స్లో సైనా నెహ్వాల్ తొలి కాంస్య పతకాన్ని సాధించారని, 2016 రియో ఒలంపిక్స్లో పీవీ సింధు తొలి రజత పతకాన్ని సాధించారని అన్నారు.
ఇదే జోరును కొనసాగిస్తూ 2020 టోక్యో ఒలంపిక్స్లో భారత్ తొలి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంటుందని పుల్లెల గోపీచంద్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు సైనా నెహ్వాల్, పీవీ సింధు బ్యాడ్మింటన్ క్రీడపట్ల దేశ ప్రజల్లో ఉన్న దృక్పదాన్ని పూర్తిగా మార్చేశారని కొనియాడాడు.
అంతకు ముందు వరకు బ్యాడ్మింటన్ క్రీడ అంటే పురుషులకు సంబంధించినది ఉండేదని అన్నారు. ఆట పట్ల ఆసక్తి, గెలవాలనే తపన ఉన్నవారు కావాలని ఈ సందర్భంగా గోపీచంద్ పేర్కొన్నారు. ఓ వ్యక్తి బయటకు వచ్చి గెలవడం ఎప్పటికీ కష్టమేనని చెప్పుకొచ్చారు. పీవీ సింధులో మరో రెండు ఒలంపిక్ పతకాలు సాధించే సత్తా ఉందని తెలిపారు.