న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్లో రజతం సాధించిన పీవీ సింధుకు అందరి నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో పిజ్జా హట్ శనివారం నాడు (ఒక్కరోజే)బంపర్ ఆఫర్ ఇచ్చింది. సింధు అన్న పేరు ఉన్న వారందరికీ పిజ్జాను ఉచితంగా అందించాలని నిర్ణయించింది.
ఈ ఆఫర్ కేవలం శనివారం మాత్రమే వర్తిస్తుందని పిజ్జా హట్ యజమాని ఉన్నత్ వర్మ తెలిపారు. అలాగే, సాక్షీ మాలిక్ కాంస్య పతకం గెలిచిన రోజు సాక్షి అన్న పేరు కలిగిన వారందరికీ ఉచితంగా పిజ్జాలు ఇచ్చినట్లు చెప్పారు.
ఇలాంటి ఆఫర్ల వల్ల భవిష్యత్తులో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుందని, దేశ కీర్తి ప్రతిష్ఠలు పెంచడంలో యువత భాగస్వామ్యం పెరుగుతుందని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. కాగా, రియోలో సింధు రజతం, సాక్షి మాలిక్ కాంస్యం గెలుచుకున్న విషయం తెలిసిందే.

మేఘాల్లో తేలుతున్నట్లుంది: పీవీ సింధు
రియోలో రజతం గెలిచిన తెలుగుతేజం పీవీ సింధు.. తనకు ఇప్పుడు గాలిలో తేలినట్టుందని చెప్పింది. ఆటల పోటీలు ప్రారంభమైన సమయంలో తనకు పతకం వస్తుందని, ఇంత దూరం ప్రయాణిస్తానని ఊహించలేదని చెప్పింది. ఇప్పుడు తనకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొంది.
మాటల్లో చెప్పలేనన, మేఘాల్లో విహరిస్తున్నట్టు అనిపిస్తోందని ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. 21 సంవత్సరాల సింధూ, ఫైనల్ లో స్పెయిన్ క్రీడాకారిణిపై పోరాడి ఓటమి పాలైనప్పటికీ, రజత పతకాన్ని గెలుచుకుని 125 కోట్ల మంది భారతీయుల అభిమానాన్ని చూరగొంది.