హైదరాబాద్: ఫ్రెంచ్ ఓపెన్లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో సైనా నెహ్వాల్ 20-22, 21-23 తేడాతో అన్సే యంగ్ (కొరియా) చేతిలో ఓడిపోయింది. గత మూడు టోర్నీల్లో తొలి రౌండ్కే పరిమితమైన సైనా నెహ్వాల్.. ఫ్రెంచ్ ఓపెన్లో కనీసం క్వార్టర్స్ వరకు దూసుకెళ్లింది.
పోరాడి ఓడిన సింధు
శుక్రవారం హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో సింధు 16-21, 26-24, 17-21తో టాప్సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడిపోయింది. తొలి గేమ్లో తై జుకి గట్టి పోటీ ఇచ్చిన సింధు.. రెండోగేమ్లో సర్వశక్తులు ఒడ్డి అద్భుతంగా ఆడింది.
#FrenchOpenSuper750: Saina Nehwal loses 20-22, 21-23 to South Korea's An Se Young in the quarterfinals pic.twitter.com/FgyEJSOwlo
— Doordarshan News (@DDNewsLive) October 25, 2019
రెండో గేమ్ ఆరంభంలో సింధు ఒక దశలో 6-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ అనూహ్యంగా పుంజుకున్న తైజు స్కోరు సమం చేయడమే కాక 20-19తో గెలుపు ముంగిట నిలిచింది. ఓ దశలో గేమ్ 24-24కు చేరింది. చివరికి సింధు 26-24తో గెలుచుకుని మ్యాచ్లో నిలిచింది. నిర్ణయాత్మక గేమ్లో చైనీస్తైపీ ప్లేయర్ అద్భుతంగా ఆడి 21-17తో గేమ్తో మ్యాచ్ని సొంతం చేసుకుంది.
మరోవైపు పురుషుల డబుల్స్లో భారత షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి-చిరాగ్శెట్టి సెమీఫైనల్ చేరారు. క్వార్టర్స్లో సాత్విక్-చిరాగ్ 21-13, 22-20తో ప్రపంచ 8వ ర్యాంకు జోడీ కిమ్ అస్ట్రప్-ఆండ్రెస్ రస్ముసెన్ (డెన్మార్క్)లపై విజయం సాధించింది.