
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్లకు నిరాశే ఎదురైంది. పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, సమీర్ వర్మ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. అయితే మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్ ముందంజ వేసింది. ఇప్పటికే పీవీ సింధు, శుభాంకర్ డేలు శుభారంభం చేసిన విషయం తెలిసిందే.
బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో శ్రీకాంత్ 21-15, 7-21, 14-21తో రెండో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్ను దక్కించుకున్న శ్రీకాంత్.. రెండు, మూడో గేమ్లను చేజార్చుకుని మ్యాచ్ను కోల్పోయాడు. 55 నిమిషాల పాటు జరిగిన పోరులో చెన్కు శ్రీకాంత్ సరైన పోటీనివ్వలేకపోయాడు.
మరో సింగిల్స్లో సమీర్ వర్మ 22-20, 18-21, 18-21తో కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. పారుపల్లి కశ్యప్ 11-21, 9-21తో నాగ్ కా లాంగ్ అంగూస్ (హాంకాంగ్)పై ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో హోరాహోరీగా సాగిన పోరులో సైనా 23-21, 21-17తో చెయుంగ్ ఎన్గాన్ యి (హాంకాంగ్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ మినహా మిగతా భారత షట్లర్ల పోరాటం తొలిరౌండ్కే పరిమితమైంది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా 13-21, 18-21తో క్రిస్ అడ్కాక్-గాబ్రియేలా అడ్కాక్ (ఇంగ్లండ్) చేతిలో ఓటమి పాలయ్యారు. అశ్విని పొన్నప్ప-సాత్విక్ సాయిరాజ్ 17-21, 18-21తో సియో సెయుంగ్ జే-చే యుజుంగ్ (కొరియా) చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ -చిరాగ్ 21-16, 21-14తో జెలీ మాస్-రాబిన్ తబెలింగ్ (నెదర్లాండ్స్)లపై గెలుపొందారు.
ఇక సుమీత్ రెడ్డి-మనూ అత్రి 19-21, 22-20, 15-21తో బెన్ లేన్-సీన్ వెండీ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి-అశ్విని పొన్నప్ప 21-16, 13-21, 17-21తో లీ సో హీ-షిన్ సెయుంగ్ చాన్ (కొరియా) చేతిలో ఓటమి పాలయ్యారు.