దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక 'ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ 750' బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఇందిరా గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని స్టేడియంలోకి ఓ కోతి ప్రవేశించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ప్రేక్షకుడిలా కూర్చుని మ్యాచ్ చూసింది!
బుధవారం ఉదయం మ్యాచ్లు జరుగుతున్న సమయంలో ప్రేక్షకుల రద్దీ తక్కువగా ఉంది. ఆ సమయంలో స్టేడియం పైభాగంలోని స్టాండ్స్లో ఓ కోతి ప్రత్యక్షమైంది. కాసేపు నిశ్శబ్దంగా కూర్చుని మ్యాచ్ను వీక్షించిన ఆ కోతి, ఆ తర్వాత నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. కేవలం మెయిన్ కోర్టులోనే కాకుండా ప్రాక్టీస్ కోర్టులో కూడా ఇది దర్శనమిచ్చింది. అక్కడ కొరియన్ జట్టు ప్రాక్టీస్ సెషన్ను కూడా ఈ కోతి కాసేపు ఆసక్తిగా గమనించడం గమనార్హం.

జంతువులకు ఎంట్రీ ఫ్రీనా?: ఆటగాళ్ల జోకులు
ఈ వింత దృశ్యాన్ని చూసిన క్రీడాకారులు ఆశ్చర్యపోవడమే కాకుండా సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు.మాజీ పురుషుల డబుల్స్ ప్రపంచ ఛాంపియన్ కాంగ్ మిన్-హ్యుక్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కోతికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ.. "జంతువులకు ఎంట్రీ ఫ్రీనా?" అంటూ ఫన్నీగా క్యాప్షన్ ఇచ్చాడు. మరికొందరు క్రీడాకారులు కూడా ఈ ఊహించని అతిథిని చూసి నవ్వుకున్నారు.
భద్రతపై ప్రశ్నలు
సాధారణంగా స్టేడియంలలోకి వీధి కుక్కలు రాకుండా నిర్వాహకులు బారికేడ్లు ఏర్పాటు చేస్తుంటారు. అయితే, పావురాలు, ఈ కోతి భద్రతా వలయాన్ని దాటుకుని లోపలికి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ కోతి ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకుండానే వెళ్లిపోయినప్పటికీ, అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్ జరుగుతున్న వేదికపైకి ఇలా జంతువులు రావడం భద్రతా లోపాలను వేలెత్తి చూపుతోంది.