హైదరాబాద్: రియో ఒలింపిక్స్ 2016లో బ్యాడ్మింటన్ విభాగంలో రజతం సాధించిన తెలుగుతేజం పీవీ సింధుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. సింధు సోమవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుంచి ఓపెన్ టాప్ బస్సులో గచ్చిబౌలి స్టేడియంకు చేరుకున్నారు. సింధు, గోపిచంద్లను సన్మానించారు.

- పలువురు నేతలు మాట్లాడిన అనంతరం పీవీ సింధును, గోపచంద్ను సత్కరించారు.
- ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ... జై సింధు, జై తెలంగాణ, జై హింద్ అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
- కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... ఒలింపిక్స్లో ముగ్గురు అమ్మాయిలు (పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్) సత్తా చాటాలని చెప్పారు. సింధుకు, గోపిచంద్కు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానన్నారు.
గెలిచిన వారికే కాదు.. కేటీఆర్
- మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. క్రీడాకారుల కర్మాగారంగా కోచ్ గోపీచంద్కు, దేశ ప్రతిష్టను నిలబెట్టిన సింధుకు అభినందనలు అన్నారు. సింధుతో పాటు సాక్షి మాలిక్ దేశానికి వన్నె తెచ్చారన్నారు. గెలిచిన వారికి రివార్డులు ఇవ్వడమే కాదని, టోక్యో ఒలింపిక్స్ కోసం అలాంటి క్రీడాకారులను తయారు చేయాలని చాలామంది సూచిస్తున్నారన్నారు.

ఈ రోజు సాయంత్రం గోపీచంద్, సింధు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవనున్నారని చెప్పారు. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ అందరికీ స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ప్రభుత్వం క్రీడలకు ప్రోత్సహిస్తోందన్నారు. కాగా, కేటీఆర్ మాట్లాడుతుండగా.. సౌండ్ వచ్చింది. దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ.. సమయం అయిపోయినట్లుందని అన్నారు.
- ఈ రోజు ప్రపంచానికి తెలంగాణ సత్తాను చాటిన సింధుకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. సింధుకు కేసీఆర్ రూ.5 కోట్లు ఇచ్చారన్నారు. తెలంగాణ క్రీడాకారులు సింధును ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నాయిని నర్సింహా రెడ్డి గట్టిగా గొంతు చించుకొని మరీ చెప్పడం గమనార్హం.
- సింధు దేశానికి గర్వకారణమని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన సింధుకు అభినందనలు అన్నారు.
- గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేసిన సత్కార వేదికపై తెలంగాణ మంత్రి కేటీఆర్... పివి సింధుకు ఘన స్వాగతం పలికారు. స్టార్ షట్లర్ భుజం తట్టిన మంత్రి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సింధు వెనుకే వచ్చిన గోపీచంద్ను దగ్గరకు తీసుకున్న కేటీఆర్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

- సింధుకు రూ.5 కోట్లు, గురువు రూ.1 కోటి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు.
- సింధును వేదిక పైకి మంత్రులు, ఎమ్మెల్యేలు సాదరంగా ఆహ్వానించారు.
- సింధుకు డప్పు, దరువులతో కళాకారులు స్వాగతం పలికారు.
- పీవీ సింధు తండ్రి రమణ తదితరులు వచ్చారు.
- గచ్చిబౌలి స్టేడియంకు కేంద్రమంత్రి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ వచ్చారు. అలాగే రాష్ట్ర మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ తదితరులు వచ్చారు.
- మధ్యాహ్నం 12.30 గంటలకు పీవీ సింధు గచ్చిబౌలి స్టేడియానికి చేరుకుంది. స్టేడియానికి భారీగా అభిమానులు, విద్యార్థులు, ఇతర ప్రముఖులు తరలి వచ్చారు. భారీ ర్యాలీ కారణంగా గచ్చిబౌలి స్టేడియం చేరుకోవడం ఆలస్యమైంది.
- పీవీ సింధు, గోపీచంద్లు రేపు (మంగళవారం) విజయవాడ బయలుదేరుతారు. వారిని ప్రత్యేక విమానంలో ఎంపీ కేశినేని నాని తీసుకెళ్లనన్నారు. సింధుతో పాటు కుటుంబ సభ్యులు, గోపీచంద్ వెళ్తారు. రేపు కృష్ణా హారతి కార్యక్రమంలో పాల్గొంటారు.
- పీవీ సింధు ఈ రోజు (సోమవారం) సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలవనున్నారు.

- దారి పొడవునా భారీ భద్రత ఏర్పాటు చేసిన అధికారులు ఊరేగింపు సందర్భంగా వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకున్నారు.
- సింధు వెళ్లే మార్గంలో దారి పొడవునా విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. జాతీయ జెండాలు ఊపుతూ సింధు జేజేలు పలికారు. సింధు.. సింధు అంటూ నినాదాలు చేశారు.
- శంషాబాద్, రాజేంద్రనగర్, ఆరంఘర్, అత్తాపూర్, మెహిదీపట్నం, టోలీచౌక్ మీదుగా గచ్చిబౌలీ వరకు ఊరేగింపు వెళ్తుంది.
- గచ్చిబౌలీ మైదానంలో పీవీ సింధును డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ, మంత్రి కేటీఆర్ సత్కరించనున్న విషయం తెలిసిందే.
- మరోవైపు, బ్యాడ్మింటన్ అకాడమీలో సింధు ఊరేగింపుకు గుర్రపు బండీని సిద్ధం చేశారు. మహారాజు స్టయిల్లో గుర్రపు బండీని తయారు చేశారు. ఊరేగింపుకు మేలు జాతి గుర్రాలను తీసుకు వచ్చారు. ఉదయం నుంచి ఈ బండిని పూర్తిస్థాయిలో అందంగా తీర్చిదిద్దారు. బండిని తెలుపు రంగులో తీర్చిదిద్ది, రోజా పూలతో అందంగా అలంకరించారు. సింధు మా రోల్ మోడల్ అని, ఆమెలా కావాలనుకుంటున్నామని గచ్చిబౌలి స్టేడియంలోని చిన్నారులు చెబుతున్నారు.

- పీవీ సింధుకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. భవిష్యత్తులో ఇంకా ఎన్నో పతకాలు సాధించాలని కోరుకుంటున్నానని చెప్పారు.
- పలువురు పుష్పగుచ్ఛాలు ఇచ్చారు.
- దారిపొడవునా విద్యార్థులు, క్రీడాభిమానులు, ప్రజలు సింధుకు జై జై సింధు అంటూ నినాదాలు చేశారు.
- శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాజేంద్ర నగర్, ఆరాంఘర్, అత్తాపూర్ మీదుగా విజయోత్సవ ర్యాలీ కొనసాగింది.
- మువ్వన్నెల జెండా చేతబట్టి వారు గచ్చిబౌలి స్టేడియంకు తరలారు.
- అనంతరం గోపీచంద్, సింధు తదితరులు ఓపెన్ టాప్ వాహనం ఎక్కారు. విమానాశ్రయం నుంచి వాహనం ర్యాలీగా బయలుదేరింది.
- సింధుకు, గోపీచంద్కు విమానాశ్రయంలో ఏపీ, తెలంగాణ ప్రముఖులు, జిహెచ్ఎంసి అధికారులు, ఇతర క్రీడాభిమానులు పుష్పగుచ్ఛం ఇచ్చి ఘన స్వాగతం పలికారు.
- తండ్రి పీవీ రమణ.. సింధుకు, గోపీచంద్లను లోపలకు వెళ్లి తోడ్కొని వచ్చారు.
సింధుకు ఇరు ప్రభుత్వాల స్వాగతం
- సింధుకు తెలంగాణ తరఫున మంత్రులు తలసాని, మహేందర్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తదితరులు స్వాగతం పలికారు.
- ఏపీ తరఫున మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, ఎంపీ కేశినేని నాని స్వాగతం పలికారు.
- గోపీచంద్, సింధులకు స్వాగతం పలికేందుకు ఇరు రాష్ట్రాల మంత్రులు, ప్రముఖులు క్యూలో నిలబడ్డారు. విదేశాల నుంచి వచ్చేవాళ్ల కోసం ఇంటర్నేషనల్ అరైవల్స్ ద్వారం ఉంటుంది. సింధు, గోపి తదితరులను మాత్రం ప్రత్యేకంగా అత్యవసర ద్వారం మీదుగా తీసుకు వచ్చారు.
- విమానాశ్రయంలో సింధుకు స్వాగతం పలికే క్రమంలో.. ఆమె కోసం విమానాశ్రయంలో వేచి చూసిన ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, విజయవాడ ఎంపీ కేశినేని నాని, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహా రెడ్డి, మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు తదితరులు పక్క పక్కనే నిలబడ్డారు. ఎయిర్ పోర్టు లాంజ్ల్లో కూర్చున్నారు. పక్క పక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు.
- సింధుతో పాటు గోపీచంద్ను ర్యాలీగా తీసుకు రానున్నారు. ర్యాలీ సందర్భంగా పలు స్కూళ్ల విద్యార్థులు, అభిమానులు రోడ్డుకు ఇరువైపులా నిలిచి సింధు పైన పూలవర్షం కురిపించనున్నారు.
- సింధు తండ్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మంచి ఏర్పాట్లు చేశారన్నారు.
- సింధు తల్లి మాట్లాడుతూ.. జీహెచ్ఎంసి సింధును ఆహ్వానించేందుకు భారీగా ఏర్పాట్లు చేసిందని, అందుకు సంతోషంగా ఉన్నామని చెప్పారు.
- శంషాబాద్ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి వరకు రెండు గంటల పాటు ర్యాలీ నిర్వహిస్తారు. సింధుకు మంగళహారతి పట్టనున్నారు.
- సింధు ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సింధు పైన పూలవర్షం కురిపించే ఏర్పాట్లు చేసినట్లుగా కూడా తెలుస్తోంది.
- శంషాబాద్, మెహిదీపట్నంల మీదుగా గచ్చిబౌలికి సింధును తీసుకెళ్లనున్నారు.
- పీవీ సింధును ఓపెన్ టాప్ జీపులో విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు తీసుకెళ్తారు.
- శంషాబాద్ విమానాశ్రయానికి సింధు తల్లిదండ్రులు, సోదరి కూడా వచ్చారు.
- పీవీ సింధు తొమ్మిది గంటల సమయానికి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది.
- సింధుకు ఘన స్వాగతం పలికేందుకు మంత్రులు మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు శంభీర్ పూర్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
- సింధును సన్మానించేందుకు గచ్చిబౌలి స్టేడియం సిద్ధమైంది. సింధును ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, కేటీఆర్లు సత్కరిస్తారు.
- సింధును ఘనంగా ఆహ్వానిస్తూ హోర్డింగులు వెలిశాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు. దారి పొడవునా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు.