ఒడెన్స్(డెన్మార్క్): డెన్మార్క్ ఓపెన్లో భారత్ పోరాటం ముగిసింది. ప్రపంచ చాంపియన్, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వరుసగా మూడో టోర్నీలోనూ పేలవ ప్రదర్శన చేసింది. గత రెండు టోర్నీల్లో క్వార్టర్స్కు చేరకుండానే వెనుదిరిగిన సింధు.. డెన్మార్క్ ఓపెన్లోనూ ఓటమి చెంది ఇంటిదారి పట్టింది. పురుషుల సింగిల్స్లో ప్రణీత్, సమీర్ వర్మ కూడా పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లో నిరాశే ఎదురైంది.
మూడో టెస్ట్.. రాంచీ పిచ్లో రివర్స్ స్వింగ్, స్పిన్లదే కీలక పాత్ర!!
డెన్మార్క్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్-750 టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ఐదో సీడ్ పీవీ సింధు 14-21, 17-21తో కొరియా అన్సీడెడ్ ప్లేయర్ అన్సే యంగ్ చేతిలో పరాజయం పాలైంది. 40నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో ఏ దశలోనూ సింధు స్థాయికి తగ్గప్రదర్శన చేయలేకపోయింది. అన్సీడెన్గా బరిలోకి దిగిన 17 ఏళ్ల యంగ్.. వరల్డ్ చాంపియన్ను ఓడించడం ఆమె కెరీర్లోనే ఓ అద్భుతం. తొలి గేమ్లో ఎక్కడ ఆధిక్యంలోకి వెళ్లని సింధు.. సునాయాసంగా గేమ్ను యంగ్కు అప్పజెప్పింది. రెండో గేమ్లో ఓసారి ఆధిక్యంలోకి వెళ్లిన సింధు.. అనంతరం తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. మరోస్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మంగళవారమే టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.
పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో భమిడిపాటి సాయి ప్రణీత్ 6-21, 14-21 తేడాతో టాప్ సీడ్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓటమిపాలయ్యాడు. 33 నిమిషాల్లో ఏ దశలోనూ ప్రత్యర్థిని నిలువరించలేకపోయిన ప్రణీత్.. తొలి గేమ్ ప్రారంభంలోనే ఏకంగా వరుసగా తొమ్మిది పాయింట్లు సమర్పించుకొని భారీ తేడాతో కోల్పోయాడు. రెండో గేమ్లో కాస్త పోటీ ఇచ్చినా.. ఆ తర్వాత మొమోటా దూకుడు ముందు నిలవలేకపోయాడు. సమీర్ వర్మ 12-21, 10-21తో ఐదో సీడ్ చెన్ లాంగ్ (చైనా) చైనా చేతిలో ఓడిపోయాడు.
పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి - చిరాగ్శెట్టి 16-21, 15-21తేడాతో ఆరో సీడ్ చైనా జోడీ హన్ చెంగ్ కై - జౌహౌ డాంగ్ చేతిలో పరాజయం పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్లో సిక్కిరెడ్డి - ప్రణవ్ చోప్రా ద్వయం 24-26, 21-13, 11-21 తేడాతో చాన్ పెంగ్ సూన్ - జోలింగ్ ఇంగ్ (మలేషియా) జంట చేతిలో చివరి వరకు పోరాడి ఓటమి చెందారు. దీంతో డెన్మార్క్ ఓపెన్లో భారత పోరు ముగిసింది.