
హైదరాబాద్: ఆస్ట్రేలియా వేదికగా వచ్చే నెలలో జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో ఖచ్చితంగా పతకం సాధించే అవకాశమున్న క్రీడాకారుల్లో తెలుగు తేజం పీవీ సింధు ఒకరు. అయితే, తాజాగా పీవీ సింధు గాయపడ్డట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని గోపీచంద్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆమె కుడికాలి చీలమండ కొద్దిగా బెణికినట్టయింది.
సింధు గాయంపై కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ ఎమ్ఆర్ఐ స్కాన్లో ఎలాంటి ప్రమాదం లేదని తేలినట్లు, వచ్చే నెలలో మొదలయ్యే కామన్వెల్త్కు దూరమయ్యేంత గాయమేమి కాదని అన్నారు. మరోవైపు ఇదేమంత ఆందోళన చెందాల్సిన గాయమేం కాదనీ సింధు తండ్రి పీవీ రమణ తెలిపారు.
'ఎమ్ఆర్ఐ స్కాన్ తీయించాం. అదృష్టవశాత్తూ ఫ్రాక్చర్లాంటిదేమీ కాలేదు. ఇప్పుడు సింధు బాగానే ఉంది. ఒక్కరోజు విశ్రాంతి తీసుకొని ఆ మరుసటి రోజు నుంచి మళ్లీ ప్రాక్టీ్సకు సిద్ధమవుతుంది. ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదు' అని ఆయన అన్నారు. ప్రస్తుతం ర్యాంకింగ్స్లో పీవీ సింధు మూడో స్థానంలో ఉంది.
2014లో గ్లాస్కోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో సింధు కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఏప్రిల్ 4 నుంచి ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్ వేదికగా ప్రారంభం కానున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత జట్టుకు ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించనుంది. టోర్నీలో భాగంగా ఏప్రిల్ 4న గోల్డ్కోస్ట్లోని కరార స్టేడియంలో ఆరంభ వేడుకలు జరగనున్నాయి.
ఈ వేడుకల్లో భాగంగా భారతీయ అథ్లెట్ల బృందానికి పీవీ సింధు త్రివర్ణ పతాకంతో నాయకత్వం వహించనుంది. రియో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ గెలిచిన సింధుకు ఈ అరుదైన ఘనత దక్కింది. భారత జట్టులో మేరి కోమ్, సైనా నెహ్వాల్ లాంటి సీనియర్ క్రీడాకారులున్నప్పటికీ సింధును ఫ్లాగ్ బేరర్గా ఎన్నుకోవడం విశేషం.