ఏడుగురు ప్లేయర్లకు పాజిటివ్
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరగుతున్న బ్యాడ్మింటన్ ఇండియా ఓపెన్ 500 టోర్నీలో కరోనా భారత్ కొంపముంచింది. నేడు ఏకంగా ఏడుగురు భారత ఆటగాళ్లకు కరోనా పాజిటివ్గా తేలింది. కరోనా బారిన పడిన వారిలో స్టార్ ఆటగాళ్లైనా మాజీ ప్రపంచ నంబర్ 1 కిదాంబి శ్రీకాంత్, రెండు సార్లు కామన్వెల్త్ గేమ్స్లో బంగార పతకం సాధించిన డబుల్స్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప కూడా ఉన్నారు.
రితికా రాహుల్ ఠక్కర్, ట్రీసా జాలీ, మిథున్ మంజునాథ్, సిమ్రాన్ అమన్ సింగ్, ఖుషీ గుప్తా కరోనా బారిన పడ్డ మరో ఐదుగురు ప్లేయర్లలో ఉన్నారు. ఈ విషయాన్ని బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్)తోపాటు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) నిర్ధారించాయి.
నేటి నుంచే రెండో రౌండ్ పోటీలు
కరోనా బారిన పడ్డ వారందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో పాజిటివ్గా నిర్దారణ అయింది. కరోనా బారిన పడిన ఆటగాళ్లందరూ కూడా ఈ లీగ్లో రెండో రౌండ్కు క్వాలిఫై అయ్యారు. కానీ కోవిడ్ కారణంగా ప్రస్తుతం వీరంతా ఇండియా ఓపెన్ టోర్నీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం వీరిని ఐసోలేషన్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కరోనా బారిన పడ్డ ఏడుగురిలో పలువురికి స్వల్ప లక్షణాలు కూడా ఉన్నాయి.
నిజానికి ఇండియా ఓపెన్లో నేటి నుంచి రెండో రౌండ్ పోటీలు జరగనున్నాయి. అయితే కరోనా బారిన పడిన వారితో ఆడాల్సిన ఆటగాళ్లు ఇక ఎలాంటి మ్యాచ్ లేకుండానే తదుపరి రౌండ్కు అర్హత సాధించనున్నారు. ఢిల్లీలోని జాదవ్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీలు ఈ నెల 11న ప్రారంభమయ్యాయి. ఈ నెల 15 వరకు జరగాల్సి ఉంది.
ఆరంభానికి ముందే సాయి ప్రణీత్కు పాజిటివ్
ఇండియా ఓపెన్ ప్రారంభమవడానికి ముందే భారత బ్యాడ్మింటన్ ఆటగాడు సాయి ప్రణీత్ కరోనా బారినపడ్డాడు. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్గా తేలడంతో టోర్నీ నుంచి తప్పుకుని ఐసోలేషన్కు వెళ్లాడు. ఆ సమయంలో ప్రణీత్కు స్వల్ప కరోనా లక్షణాలు కూడా ఉన్నాయి. అలాగే ఇంగ్లండ్కు చెందిన ఇద్దరు బ్యాడ్మింటన్ ఆటగాళ్లు కూడా టోర్నీ ఆరంభానికి మందే పాజిటివ్గా తేలారు. దీంతో ఇంగ్లండ్ టీం మొత్తమే ఇండియా ఓపెన్ నుంచి నిష్క్రమించింది.