భారత టైమింగ్ ప్రకారం.. నేడు రాత్రి 11.30కి కామన్ వెల్త్ క్రీడల ప్రారంభోత్సవం మొదలు కానుంది. అయితే కామన్వెల్త్ క్రీడల ప్రారంభానికి కొద్ది టైం ఉన్న తరుణంలో భారత బృందానికి షాక్ తగిలింది. ఓపెనింగ్ సెర్మనీలో టీమిండియా మెన్స్ హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్తో పాటు పీవీ సింధు ఫ్లాగ్ బేరర్గా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా పీవీ సింధుకు కరోనా టెస్టులో మిశ్రమ రిజల్ట్స్ వచ్చినట్లు సమాచారం. పీవీ సింధుకు ఆర్టీపీసీఆర్ టెస్ట్లో ఒక్కోసారి ఒక్కో ఫలితం వచ్చినట్లు కన్పించింది.
ఓసారి పాజిటివ్ మరోసారి నెగెటివ్ ఫలితాన్ని చూపించడంతో ముందు జాగ్రత్తగా సింధును ఐసోలేషన్కు పంపించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ వార్తలన్నీ గాలి వార్తలేనని.. ఆమె ఫ్లాగ్ బేరర్గా కన్పించబోతుందని మరికొందరు పేర్కొంటున్నారు. భారత బృందానికి చెందిన ఓ అధికారి ఈ విషయమై స్పందిస్తూ.. సింధుకు ఆర్టీపీసీఆర్ పరీక్ష అయితే జరిగింది కానీ రిజల్ట్ విషయంలోనే ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొందని, ఐసోలేషన్లో ఉన్న సింధుకు మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్ష జరిపి నెగెటివ్ వస్తే ఆమె నిరభ్యంతరంగా కామన్వెల్త్ క్రీడా విలేజ్లోకి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
పీవీ సింధు జులై 25న హైదరాబాద్ నుంచి బర్మింగ్హామ్కు వెళ్లింది. వెళ్లే ముందు, వెళ్లాక ఆమెకు నిబంధనల ప్రకారం కోవిడ్ టెస్ట్ జరిపారు. ఆమెకు ఆ టెస్టుల్లో నెగెటివే చూపించింది. కానీ తాజాగా జరిపిన టెస్టులో మాత్రం ఆమెకు కరోనా వచ్చింది రానిది మాత్రం ఇంకా స్పష్టంగా వెల్లడి కాలేదు. మరో గంటలో అన్ని వివరాలు తెలుస్తాయి. ఇకపోతే ప్రారంభం కోసం బర్మింగ్ హామ్ ముస్తాబయింది. 214 మంది సభ్యులతో కూడిన భారత బృందం ఈ గేమ్స్లో పాల్గొంటుంది.