
హైదరాబాద్: మలేషియా స్టార్ షట్లర్ లీ చోంగ్ వీ పన్నెండోసారి మలేషియా ఓపెన్ టైటిల్ను గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగి ల్స్ ఫైనల్లో లీ చోంగ్ వీ 21-17, 23-21తో కెంటో మొమొటా (జపాన్)పై విజయం సాధించాడు.
గేమ్ ప్రారంభంమైనప్పటి నుంచి లీ చోంగ్ వీ తన ఎటాకింగ్ గేమ్తో ప్రత్యర్ధిపై దూకుడుగా ఆడటం ప్రారంభించాడు. ఈ క్రమంలో తొలి గేమ్ ఆద్యంతం అద్భుత ప్రదర్శన చేసిన లీ చోంగ్ వీ, రెండో గేమ్లో మరింత రెచ్చిపోయి ఆడాడు. 71 నిమిషాల పాటు సాగిన ఈ గేమ్లో ప్రత్యర్ధికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు.
తాజా విజయంతో ఆసియా ఛాంపియన్షిప్ సెమీఫైనల్లో మొమోటా చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు. లీ చోంగ్ వీ చేతిలో ఓటమి అనంతరం కెంటో మొమోటా మాట్లాడుతూ "అతడు నాకన్నా 12 ఏళ్లు పెద్దవాడైనా చాలా బలమైన ఆటగాడు. ఇప్పటికీ పురుషుల బ్యాడ్మింటన్ను శాసిస్తున్నాడు'' అని అన్నాడు.
ఇక, మహిళల సింగిల్స్ టైటిల్ను టాప్ సీడ్ తై జు యింగ్ (తైవాన్) చేజిక్కించుకుంది. ఫైనల్లో ఆమె 22-20, 21-11తో చైనాకు చెందిన బింగ్జియావోపై విజయం సాధించింది.