న్యూ ఢిల్లీ: చైనా ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడో సీడ్ శ్రీకాంత్ 21-9, 21-19తో రస్ముస్ గెమ్కీ (డెన్మార్క్)పై నెగ్గి ప్రిక్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టాడు. ప్రణయ్ 16-21, 12-21తో లాంగ్ ఆగ్నస్ (హాంకాంగ్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్ సాయిరాజు- అశ్విని పొన్నప్ప జోడీ సంచలనం సృష్టించింది. తొలి రౌండ్లో సాత్విక్- అశ్విని జంట 21-13, 20-22, 21-17తో కామన్వెల్త్ క్రీడల రజత పతక విజేత మార్కస్- లారెన్ (ఇంగ్లాండ్) జోడీపై నెగ్గి ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్- చిరాగ్ శెట్టి 19-21, 20-22తో షెమ్- టాన్ వీ (మలేసియా) చేతిలో ఓడారు.
మహిళల డబుల్స్లో సిక్కిరెడ్డి-అశ్వినీ ద్వయం 10-21, 18-21తో కొరియా జంట కిమ్ సో-కాంగ్ హీ చేతిలో ఓడి తమ పోరాటాన్ని తొలిరౌండ్కే పరిమితం చేసింది. ఆసియా క్రీడల తర్వాత పాల్గొన్న తొలి టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్కు నిరాశ ఎదురుకాగా... పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం మొదలైన చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నమెంట్లో సైనా తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది.
ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)తో జరిగిన మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లో ప్రపంచ పదో ర్యాంకర్ సైనా 22-20, 8-21, 14-21తో ఓడిపోయింది. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సైనా తొలి గేమ్ను సొంతం చేసుకున్నా.... ఆ తర్వాత తడబడింది. మరో తొలి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 21-15, 21-13తో ప్రపంచ 39వ ర్యాంకర్ సెనా కవకామి (జపాన్)ను ఓడించింది. ఆద్యంతం దూకుడుగా ఆడిన సింధు కేవలం 26 నిమిషాల్లోనే తన ప్రత్యర్థి ఆట కట్టించింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో బుసానన్ (థాయ్లాండ్)తో సింధు ఆడుతుంది.