హైదరాబాద్: భారత షట్లర్లకు మరో సూపర్ సిరిస్కు సిద్ధమయ్యారు. మంగళవారం నుంచి చైనా ఓపెన్ సిరీస్ ప్రారంభం అవుతోంది. ఇటీవల నాగ్పూర్ వేదికగా జరిగిన జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో విజేతలుగా నిలిచిన స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్లు ఈ టోర్నీలో టైటిలే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు.
ఇటీవల ప్రకటించిన ర్యాంకింగ్స్లో వీరిద్దరూ మహిళల, పురుషుల ర్యాంకింగ్స్లో 11వ స్థానంలో నిలిచారు. మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్తో పాటు ప్రస్తుతం రెండో ర్యాంకులో ఉన్న పీవీ సింధు కూడా టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్ తన తొలి రౌండ్లో అమెరికాకు చెందిన బేవెన్ జాంగ్తో తలపడనుంది.
రెండో సీడ్గా బరిలో ఉన్న పీవీ సింధు తొలి రౌండ్లో జపాన్కు చెందిన సయాక సటొ తో పోటీపడుతోంది. తొలి రెండు రౌండ్లో సింధు విజయం సాధిస్తే జపాన్ స్టార్ షట్లర్ నొజొమి ఒకుహరతో పోటీ పడే అవకాశం ఉంది. పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్ కూడా టైటిల్ బరిలో దిగుతున్నాడు. ప్రణయ్తో పాటు సౌరభ్వర్మ కూడా బరిలో ఉన్నాడు.

మరోవైపు గాయం కారణంగా కిదాంబి శ్రీకాంత్ ఈ టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. కాగా, సమీర్వర్మ, అజయ్ జయరాం, సాయిప్రణీత్ కూడా టోర్నీ నుంచి తప్పుకున్నారు. మిక్స్డ్ డబుల్స్లో ప్రణవ్ చోప్రా-సిక్కిరెడ్డి, పురుషుల డబుల్స్లో మను అత్రి-సుమీత్రెడ్డి, సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి పోటీలో ఉన్నారు.
జాతీయ ఛాంపియన్లు సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప మహిళల డబుల్స్ బరిలో దిగుతుండగా... అశ్విని, సాత్విక్తో కలిసి మిక్స్డ్లోనూ పోటీపడుతోంది.