
ఫుజౌ(చైనా): భారత బ్యాడ్మింటన్ ద్వయం రాంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి మరోసారి సత్తాచాటారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ - 750 చైనా ఓపెన్ టోర్నీలో క్వార్టర్స్కు చేరారు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో ప్రపంచ 11వ ర్యాంకు సాత్విక్ జోడీ 21-18, 21-23, 21-11 తేడాతో ఆరో సీడ్ జపాన్ ద్వయం హిరోయుకు ఇండో-యుతా వతాంబేపై గెలుపొందారు. గంటా ఆరు నిమిషాల పాటు హోరాహోరీగా పోరు సాగింది.
తొలి గేమ్ ప్రారంభంలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సాత్విక్ జోడీ 10-6తో ముందంజలో నిలిచించి. జపాన్ ద్వయం పుంజుకోవడంతో 14-17తో వెనుకబడింది. వరుసగా ఆరు పాయింట్లు సాధించడంతో సాత్విక్ జోడీ తొలి గేమ్ను గెలిచింది. రెండో గేమ్ చివరి వరకు పోరు హోరాహోరీగా సాగగా.. చివర్లో పట్టువిడవని వతాంబే జోడీ గేమ్ను సొంతం చేసుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్లో సాత్విక్ జోడీ రెచ్చిపోయింది. అద్భుత ఆటతో జపాన్ ద్వయంను చిత్తుచేసి క్వార్టర్స్లో అడుగుపెట్టింది. క్వార్టర్స్లో మూడో సీడ్ చైనా జోడీ లీజన్ హు-యుచెన్తో భారత ద్వయం శుక్రవారం తలపడనుంది.
సాత్విక్ సాయిరాజ్ డబుల్స్లో క్వార్టర్స్ చేరగా.. మిక్స్డ్ డబుల్స్లో మాత్రం ప్రిక్వార్టర్స్ అడ్డంకిని దాటలేకపోయాడు. మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్- అశ్విని పొన్నప్ప జంట 21-23, 16-21తో టోర్నీ ఐదో సీడ్ సియో సెయుంగ్ జే- చే యుజుంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడింది.
పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత సాయి ప్రణీత్ 20-22,22-20, 16-21 తేడాతో నాలుగో సీడ్ అంజెర్స్ అంటోస్ (డెన్మార్క్) చేతిలో గంటా 24 నిమిషాల పాటు పోరాడి ఓడాడు. మరో మ్యాచ్లో పారుపల్లి కశ్యప్ 13-21, 19-21తో ఏడో సీడ్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)పై పరాజయం పాలయ్యాడు. దీంతో చైనా ఓపెన్ సింగిల్స్లో భారత పోరు ముగిసింది. మహిళల సింగిల్స్లో స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ తొలి రౌండ్లోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే.