
చాంగ్జౌ: చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్కు షాక్ తగిలింది. చైనా ఓపెన్ ప్రారంభ రౌండ్లో 8వ సీడ్ సైనా ఓడిపోయింది. మహిళల సింగిల్స్లో భాగంగా బుధవారం జరిగిన తొలి రౌండ్లో థాయ్లాండ్కు చెందిన క్రీడాకారిణి, ప్రపంచ 19వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్బమ్రుంగ్ఫాన్ 10-21, 17-21తో సైనా నెహ్వాల్ను వరుస గేమ్లలో ఓడించింది.
మ్యాచ్ ఆరంభం నుండి బుసానన్ ఆధిపత్యం చెలాయించింది. తొలి గేమ్లో 10-21తో సైనా పూర్తిగా తేలిపోయింది. అయితే రెండో గేమ్లో 17-21తో పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్ 44 నిమిషాల పాటు జరిగింది. తొలి రౌండ్లో ఓడిపోవడంతో ఈ టోర్నీలో సైనా పోరు ముగిసింది. బుసానన్ వరుసగా సైనాను రెండోసారి ఓడించింది.
ఈ ఏడాది ఇండోనేషియా మాస్టర్స్ గెలిచిన సైనా.. ఆ తర్వాత గాయం కారణంగా చాలా టోర్నీలకు దూరమైంది. అయితే ప్రపంచ చాంపియన్షిప్లో మంచి ప్రదర్శనే చేసినా.. క్వార్టర్స్లో అంపైర్ల వివాదాస్పద నిర్ణయాల కారణంగా ఓటమిని చవిచూసి ఇంటిబాట పట్టింది. ఇప్పుడు చైనా ఓపెన్ ప్రారంభ రౌండ్లో కూడా సైనా విఫలమయింది.
ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన తెలుగు షట్లర్ పీవీ సింధు బుధవారం సాయంత్రం మ్యాచ్ ఆడనుంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మాజీ ఒలింపిక్ స్వర్ణ పతక విజేత లీ షిరూ (చైనా)తో సింధు తలపడనుంది. లీ షిరూ, సింధు ఇప్పటివరకు ఆరుసార్లు తలపడగా.. చెరో మూడు సార్లు విజయం సాధించారు. దీంతో ఈ పోరు రసవత్తరంగా సాగనుంది. అయితే సింధు ప్రస్తుత ఫామ్ చూస్తే క్వార్టర్స్ వరకు అలవోకగా చేరుకునే అవకాశం ఉంది.