హైదరాబాద్: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ మరికొద్ది నెలల్లో ప్రారంభం అయ్యేందుకు తొలి అడుగు పడింది. రాజధాని గ్రామాల్లో ఒకటైన వెంకటపాలెం పరిధిలో గోపీచంద్ అకాడమీకి 12.5 ఎకరాలను ఉచితంగా ఇచ్చేందుకు సీఆర్డీయే నిర్ణయం తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
గోపీచంద్ గురువారం విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ని కలిశారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో జరిగిన చర్చల్లో గోపీచంద్ అకాడమీకి 12.5 ఎకరాలను ఉచితంగా ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఈ విషయమై సీఎం చంద్రబాబుని గోపీచంద్ బుధవారం కలిశారు. ఈ నేపథ్యంలో అకాడమీకి స్థలం కేటాయింపుపై సుముఖంగా ఉన్నప్పటికీ, గురువారం నాటి చర్చల్లో స్థలానికి సంబంధించి విస్తీర్ణం, ఏ గ్రామంలో దీనిని నెలకొల్పాలనే అంశాలపై స్పష్టత వచ్చింది.
నిజానికి అమరావతిలో స్ధాపించబోయే అకాడమీ కోసం గోపీచంద్ పెద్ద మొత్తంలో భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ క్రమంలో గోపీచంద్ అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కేవలం 12.50 ఎకరాలను మాత్రమే ఇస్తామని ప్రతిపాదించగా గోపీచంద్ అందుకు అంగీకరించారు.
దీంతో తాను స్దాపించబోయే అకాడమీ స్థల విస్తీర్ణంపై స్పష్టత వచ్చినందున త్వరలో శిక్షణ సంస్థకు సంబంధించిన వివరాలతో డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)ను గోపీచంద్ అకాడమీ నిర్వహాకులు సీఆర్డీయేకు సమర్పించాల్సి ఉంటుంది. కాగా, గోపీచంద్కి ఇప్పటికే హైదరాబాద్లో ఓ అకాడమీ ఉన్న సంగతి తెలిసిందే.
గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొంది పీవీ సింధు రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించగా, ఇటీవలే కిదాంబి శ్రీకాంత్ ఇండోనేషియా, ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరిస్ టైటిళ్లను గెలిచారు. దీంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కిదాంబి శ్రీకాంత్తో పాటు గోపీచంద్ను సన్మానించి భారీ నజరానాను ప్రకటించారు.
వరుసగా రెండు టైటిల్స్ ను సాధించిన శ్రీకాంత్ కు వెయ్యి గజాల స్థలం రూ.50 లక్షల నగదును ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు. గ్రూప్1 ఉద్యోగం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. కోచ్ పుల్లెల గోపిచంద్ కు రూ. 15 లక్షల బహుమతిని ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు.