
బాసెల్: స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధుకు నిరాశే ఎదురైంది. అద్వితీయమైన ఆటతీరుతో టైటిల్పై ఆశలు రేపిన సింధు చివరకు రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. తనపై తిరుగులేని రికార్డున్న స్పెయిన్ స్టార్ కరోలినా మారీన్కు మరోసారి సింధు తలవంచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ సింధు 12-21, 5-21తో టాప్ సీడ్ మారీన్ చేతిలో చిత్తుగా ఓడింది.
35 నిమిషాల పాటు జరిగిన ఫైనల్ పోరులో కరోలినా మారీన్కు ఎదురులేకుండా పోయింది. తొలి గేమ్లో 6-4తో ఆధిక్యంలో నిలిచిన సింధును వరుసగా అయిదు పాయింట్లతో మారీన్ వెనక్కి నెట్టింది. అక్కడ్నుంచి ఆటంతా ఆమె ఆధిపత్యం చెలాయించింది. 15-10తో మరింత ముందంజ వేసిన మారీన్ వెనుదిరిగి చూడలేదు. 21-12తో తొలి గేమ్ను సొంతం చేసుకుంది. రెండో గేమ్ మరింత దూకుడుగా ఆడింది.
మారీన్ ఆటతో మ్యాచ్పై ముందే ఆశలు వదులుకున్నట్లు కనిపించిన తెలుగుతేజం పీవీ సింధు అసలు పోటీనే ఇవ్వలేదు. 11-2తో ఆధిక్యంలో నిలిచిన మారీన్.. 21-5తో రెండో గేమ్తో పాటు మ్యాచ్ను సొంతం చేసుకుంది. సింధుపై తన గెలుపోటముల రికార్డును మారీన్ 9-5తో మరింత మెరుగుపరుచుకుంది. 2021లో మారిన్కిది మూడో టైటిల్ కావడం విశేషం. రన్నరప్గా నిలిచిన సింధుకు 5,320 డాలర్ల (రూ. 3 లక్షల 89 వేలు) ప్రైజ్మనీ లభించింది. 18 నెలల తర్వాత మేజర్ ఈవెంట్ ఫైనల్కు చేరిన సింధు.. అభిమానులను నిరాశకు గురిచేసింది.
మరోవైపు స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ టైటిల్ను టాప్ సీడ్ విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) గెలుచుకొన్నాడు. ఫైనల్లో అక్సెల్సెన్ 21-16, 21-6తో కున్లావత్ విటిడ్సర్న్ (థాయ్లాండ్)పై విజయం సాధించాడు. మార్చి 17 నుంచి 21 వరకు ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్తో బిడబ్ల్యుఎఫ్ వరల్డ్ టూర్ కొనసాగనుంది.