
భారత స్టార్ షట్లర్లు పారుపల్లి కశ్యప్, సౌరభ్ వర్మలు దూసుకెళుతున్నారు. కెనడాలోని క్లాగరీ వేదికగా జరుగుతున్న కెనడా ఓపెన్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నీలో కామన్వెల్త్ గేమ్ ఛాంపియన్ పారుపల్లి కశ్యప్, సౌరభ్ వర్మలు ప్రీక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మరోవైపు లక్ష్యసేన్, అజయ్ జయరామ్, హెచ్ఎస్ ప్రణయ్ రెండో రౌండ్లోనే ఇంటి దారిపట్టారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ఆరోసీడ్ కశ్యప్ 21-12, 21-17తో లుకాస్ కార్వీ (ఫ్రాన్స్)పై సునాయాస విజయం సాధించాడు. సౌరభ్ వర్మ 21-14, 21-11తో సంకీర్త్ (కెనడా)పై కూడా సులువైన విజయాన్ని అందుకున్నాడు. ప్రీ క్వార్టర్స్లో రెన్ పెంగ్ బో (చైనా)తో కశ్యప్, సన్ఫె జియాంగ్ (చైనా)తో సౌరభ్ వర్మ తలపడనున్నారు.
కశ్యప్, సౌరభ్ ముందడుగు వేసినా.. లక్ష్యసేన్, అజయ్ జయరామ్, హెచ్ఎస్ ప్రణయ్ నిరాశపరిచాడు. మూడోసీడ్ ప్రణయ్ 16-21, 10-21తో కొకీ వాంటనబె (జపాన్) ఓటమిపాలయ్యాడు. ఇక అజయ్ జయరామ్ 19-21, 17-21తో రాజీవ్ ఓసెఫ్ (ఇంగ్లండ్).. లక్ష్యసేన్ 7-21, 13-21తో వెంగ్ హాంగ్ (చైనా) చేతిలో ఓడారు. జూలై 9 నుండి 14 వరకు జరగబోయే యుఎస్ ఓపెన్ బిడబ్ల్యుఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 300 ఈవెంట్లో భారత త్రయం బాగా రాణించాలని భావిస్తోంది.