భారత స్టార్ షట్లర్ పారుపల్లి కశ్యప్ దూసుకెళుతున్నాడు. కెనడాలోని క్లాగరీ వేదికగా జరుగుతున్న కెనడా ఓపెన్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నీలో కామన్వెల్త్ గేమ్ ఛాంపియన్ పారుపల్లి కశ్యప్ సెమీస్లోకి ప్రవేశించాడు. మరోవైపు సౌరభ్ వర్మకు షాక్ తగిలింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ పోరులో ఆరో సీడ్ కశ్యప్ 12-21, 23-21, 24-22 తేడాతో లుకాస్ క్లెర్బౌట్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
గంటా 16 నిమిషాల పాటు ఈ మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. తొలి గేమ్ కోల్పోయిన కశ్యప్.. రెండో గేమ్, నిర్ణయాత్మక మూడో గేమ్లో పుంజుకుని సత్తా చాటాడు. సెమీస్లో తైపీ ఆటగాడు వాంగ్ త్జు వీతో కశ్యప్ తలపడనున్నాడు. మరోవైపు లి షి ఫెంగ్ (చైనా )పై సౌరభ్ వర్మ 21-15, 21-11 తేడాతో ఓడిపోయాడు. ఫెంగ్ దాడికి వర్మ పూర్తిగా చేతులెత్తేశాడు. వరుస గేమ్లో ఓడి మూల్యం చెల్లించుకున్నాడు.
అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్ పోరులో కశ్యప్ 23-21, 21-23, 21-19 తేడాతో రెన పెంగ్ బో(చైనా)పై చెమటోడ్చి గెలిచాడు. దాదాపు గంటన్నర పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో కశ్యప్కు చైనా షట్లర్ పోటీనిచ్చాడు. ఇద్దరు నువ్వానేనా అన్నట్లు పోటీ పడ్డారు. తొలి గేమ్ను 23-21తో దక్కించుకున్న కశ్యప్.. ప్రత్యర్థికి రెండో గేమ్ను చేజార్చుకున్నాడు. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్లో పుంజుకున్న కశ్యప్.. చైనా షట్లర్ అవకాశమివ్వకుండా మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు. సౌరభ్ వర్మ 21-13, 15-21, 21-15తో సున్ ఫి జియాంగ్ (చైనా)పై గెలిచాడు.