భారత స్టార్ షట్లర్ పారుపల్లి కశ్యప్ చాన్నాళ్ల తర్వాత ఫామ్లోకొచ్చాడు. కెనడాలోని క్లాగరీ వేదికగా జరుగుతున్న కెనడా ఓపెన్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నీలో కామన్వెల్త్ గేమ్ ఛాంపియన్, హైదరాబాద్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇక టైటిల్కు ఒక్క విజయం దూరంలో నిలిచాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఆరోసీడ్ కశ్యప్ 14-21, 21-17, 21-18తో నాలుగో సీడ్ వాంగ్ జూ వీ (చైనీస్ తైపీ)పై విజయాన్ని సాధించాడు. తొలి గేమ్ కోల్పోయిన కశ్యప్.. రెండో గేమ్, నిర్ణయాత్మక మూడో గేమ్లో పుంజుకుని సత్తా చాటాడు. 70 నిమిషాల పాటు ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఇక ఫైనల్లో చైనా షట్లర్, ప్రపంచ 126వ ర్యాంకర్ లీ షి ఫెంగ్తో కశ్యప్ తలపడతాడు.
ఈ ఏడాది ఇప్పటివరకు తొమ్మిది టోర్నీల్లో ఆడిన కశ్యప్.. ఏ ఒక్క టోర్నీలోనూ ఫైనల్ బెర్త్ దక్కించుకోలేకపోయాడు. కానీ కెనడా ఓపెన్లో మాత్రం నిలకడగా రాణిస్తూ టైటిల్ వేటలో ఉన్నాడు. అంతకుముందు జరిగిన క్వార్టర్స్ పోరులో కశ్యప్ 12-21, 23-21, 24-22 తేడాతో లుకాస్ క్లెర్బౌట్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. ఇక ప్రిక్వార్టర్స్ పోరులో కశ్యప్ 23-21, 21-23, 21-19 తేడాతో రెన పెంగ్ బో(చైనా)పై చెమటోడ్చి గెలిచాడు. దాదాపు గంటన్నర పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో కశ్యప్కు చైనా షట్లర్ పోటీనిచ్చాడు.