గ్వాంగ్ జౌ(చైనా): బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిరాశ పరిచింది. సెమీఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా నెగ్గాల్సిన మ్యాచ్లో డిఫెండింగ్ చాంప్ సింధు పోరాడి ఓడిపోయింది. గురువారం గ్రూప్-ఎలో జరిగిన రెండో మ్యాచ్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ సింధు 22-20, 16-21, 12-21తో ప్రపంచ రెండో ర్యాంకర్ చెన్ యుఫీ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. తొలి మ్యాచ్లో యమగూచితో ఓడిన తరహాలోనే ఈ మ్యాచ్ను కూడా కోల్పోయింది.
బీసీసీఐ ట్వీట్.. హార్దిక్, రాహుల్ల మధ్య ఏం జరుగుతుంది?!!
72 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సింధు తొలి గేమ్లో 17-20తో వెనుకబడింది. అయితే ఒక్కసారిగా చెలరేగిన సింధు వరుసగా ఐదు పాయింట్లు సాధించి తొలి గేమ్ను 22-20తో సొంతం చేసుకుంది. రెండో గేమ్లో సింధుకు ఏమాత్రం అవకాశం ఇవ్వని యుఫీ 21-16తో నెగ్గి మ్యాచ్ ఫలితాన్ని చివరి గేమ్కు తీసుకెళ్లింది. ఇక నిర్ణాయక మూడో గేమ్లో చెన్ యుఫె తన దూకుడు కొనసాగించింది. ఓదశలో సింధు 4-8తో వెనుకబడినా.. చక్కటి పోరాటం కనబరిచి 10-10తో స్కోరును సమం చేసి పోటీలోకొచ్చింది. ఇక 12-12తో ఇరువురూ సమంగా ఉన్న దశలో యుఫీ వరుసగా 9 పాయింట్లతో గేమ్తో పాటు మ్యాచ్ను సైతం సొంతం చేసుకుంది.
వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడడంతో టోర్నీలో సింధు నాకౌట్ అవకాశాలు గల్లంతయ్యాయి. మరో మ్యాచ్లో అకానె యామగుచి 25-27, 21-10, 21-13తో హి బింగ్జియావో (చైనా)పై గెలిచింది. గ్రూప్ ఎలో రెండేసి మ్యాచ్లు నెగ్గినందుకు చెన్ యుఫె, యామగుచి సెమీఫైనల్కు చేరారు. దీంతో శుక్రవారం హి బింగ్జియావోతో సింధు మ్యాచ్ నామమాత్రమే.
బుధవారం మహిళల సింగిల్స్ గ్రూప్-ఏలో సింధు 21-18, 18-21, 8-21 తేడాతో ప్రపంచ మాజీ నంబర్వన్ అకానే యమగూచి (జపాన్) చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ 68 నిమిషాల పాటు హోరాహోరీగా సాగింది. గ్రూప్-ఏ మ్యాచ్ ముగిసిన తర్వాత సింధుకు డోప్ పరీక్ష నిర్వహించారు. గత రెండు నెలల్లో సింధుకు ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా), జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఆధ్వర్యంలో నాలుగు సార్లు (డెన్మార్క్, పారిస్, హైదరాబాద్) డోప్ టెస్టులు జరిగాయి.