గ్వాంగ్జౌ (చైనా): బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు షాక్ తగిలింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన సింధు తొలి మ్యాచ్లోనే పరాజయం పాలయింది. బుధవారం మహిళల సింగిల్స్ గ్రూప్-ఏలో ప్రపంచ ఆరో ర్యాంకర్ సింధు 21-18, 18-21, 8-21 తేడాతో ప్రపంచ మాజీ నంబర్వన్ అకానే యమగూచి (జపాన్) చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ 68 నిమిషాల పాటు హోరాహోరీగా సాగింది.
వన్డే సిరీస్: ధావన్ స్థానంలో మయాంక్.. శాంసన్కు నిరాశ!!
తొలి గేమ్ ప్రారంభంలో హోరాహోరీగా సాగినా.. ఆ తర్వాత సింధు పుంజుకుంది. 6-6తో పాయింట్లు సమమైన సమయంలో వరుసగా పాయింట్లు సాధిస్తూ 21-18తో తొలి గేమ్ను కైవసం చేసుకుంది. రెండో గేమ్లోనూ సింధు ఓ దశలో 11-6తో ఆధిక్యంలో నిలిచింది. ఇక 15-11తో ముందంజలో ఉన్న సమయంలో.. యమగూచి వరుసగా ఐదు పాయింట్ల సాధించి రేసులోకి వచ్చింది. పుంజుకున్న సింధు 18-16తో ముందుకెళ్లినా.. అనవసర తప్పిదాలతో మరోసారి యమగూచికి ఐదు పాయింట్లు ఇచ్చి 18-21తో గేమ్ను కోల్పోయింది.
నిర్ణాయక మూడో గేమ్లో యామగుచి చెలరేగిపోగా.. సింధు ఏదశలోనూ కనీస పోటీనివ్వలేకపోయింది. ఆరంభంలోనే 5-0తో ఆధిక్యంలోకి వెళ్లిన యామగుచి ఆ తర్వాత సింధుకు ఏదశలోనూ కోలుకునే అవకాశం ఇవ్వకుండా 8-21తో మ్యాచ్ను ముగించింది. గురువారం జరిగే గ్రూప్-ఏ రెండో లీగ్ మ్యాచ్లో ప్రపంచ రెండో ర్యాంకర్ చెన్ యుఫె (చైనా)తో సింధు ఆడుతుంది. సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే.. ఈ మ్యాచ్లో సింధు తప్పనిసరిగా గెలవాలి.
గ్రూప్-ఏ మ్యాచ్ ముగిసిన తర్వాత సింధుకు డోప్ పరీక్ష నిర్వహించారు. గత రెండు నెలల్లో సింధుకు ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా), జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఆధ్వర్యంలో నాలుగు సార్లు (డెన్మార్క్, పారిస్, హైదరాబాద్) డోప్ టెస్టులు జరిగాయట. ఈ రోజు చెన్ యుఫెతో మ్యాచ్ ఉందనగా.. చైనా కాలమానం ప్రకారం రాత్రి ఒకటిన్నరకు సింధుకు డోప్ టెస్టు నిర్వహించారని సమాచారం.