
హైదరాబాద్: స్విట్జర్లాండ్లోని బాసెల్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజు యింగ్పై 12-21, 23-21, 21-19 తేడాతో పీవీ సింధు విజయం సాధించింది.
తొలి గేమ్లో ఓడినప్పటికీ ఆ తర్వాతి రెండు గేముల్లో పీవీ సింధు పుంజుకున్న తీరు నిజంగా అద్భుతం. రెండు, మూడు గేముల్లో తన పోరాట పటిమను ప్రదర్శించిన సింధు మ్యాచ్ని కూడా సొంతం చేసుకుంది. ఇద్దరి మధ్య ప్రతి పాయింట్ కోసం హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్కి ముందు తైజు యింగ్ ఫేవరేట్గా బరిలోకి దిగింది.
తొలి గేమ్లో సింధు ప్రత్యర్థి దూకుడు ముందు తేలిపోవడంతో తొలి గేమ్ను 9 పాయింట్ల తేడాతో చేజార్చుకుంది. రేసులో ఉండాలంటే సింధు రెండో గేమ్ను తప్పక గెలవాల్సి ఉంది. ఈ తరుణంలో గట్టిగా పుంజుకున్న సింధు స్వల్ప తేడాతో రెండో గేమ్ను సొంతం చేసుకుంది.
ఇక నిర్ణయాక మూడో గేమ్ ఆరంభం నుంచే తైజు ఆధిపత్యం కొనసాగింది. గేమ్ మధ్యలో పుంజుకున్న సింధు మళ్లీ తన మునుపటి ఆటను ప్రదర్శించింది. ఆఖరి గేమ్ ఆద్యంతం అద్భుతంగా ఆడిన సింధు 21-19 తేడాతో గేమ్ను, మ్యాచ్ను సొంతం చేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో సింధుకు పతకం ఖాయమవడం ఇది ఐదోసారి. ఇప్పటి వరకు రెండు రజతాలు, రెండు కాంస్యాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. మరోవైపు ప్రీ క్వార్టర్స్లోనే సైనా నెహ్వాల్ ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే.