తొలి సెట్ లక్ష్యసేన్దే
భారత ఆటగాళ్ల మధ్య జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సెమీఫైనల్1లో తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్, ఉత్తరాఖండ్కు చెందిన లక్ష్యసేన్ నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. ఇద్దరూ ఫైనల్ చేరడమే లక్ష్యంగా ప్రతి షాట్ ఆడడంతో చివరి వరకు ఉత్కంఠ తప్పలేదు. 28 ఏళ్ల కిదాంబి శ్రీకాంత్, 20 ఏళ్ల లక్ష్యసేన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ 69 నిముషాలపాటు సాగింది. 17 నిముషాలపాటు హోరాహోరిగా సాగిన తొలిసెట్ను చివరకు యువ ఆటగాడు లక్ష్యసేన్ 21-17తో ఎగురేసుకోపోయాడు. కొన్ని అన్నవసరమైన తప్పిదాలతో శ్రీకాంత్ తొలి సెట్ను చేజార్చుకున్నాడు.
రెండో సెట్లో పుంజుకున్న శ్రీకాంత్
తొలి సెట్లో ఓటమితో వెనుకబడ్డ కిదాంబి శ్రీకాంత్ రెండో సెట్లో అద్భుతంగా పుంజుకున్నాడు. అయితే లక్ష్యసేన్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. ఇద్దరు డ్రాప్ షాట్లు, క్రాస్కోర్టు షాట్లతో చెలరేగారు. ఓ దశలో కిదాంబి శ్రీకాంత్ రెండో సెట్లోనూ 6-9తో వెనుబడ్డాడు. ఈ దశలో తన అనుభవాన్నంతా ఉపయోగించిన శ్రీకాంత్.. ఎట్టకేలకు పుంజుకోని మ్యాచ్లోకి వచ్చాడు. ఆ తర్వాత వరుసగా 6 పాయింట్లు సాధించి రెండోసెట్లో ఒక్క సారిగా 12-9తో అధిక్యంలోకి దూసుకెళ్లాడు. అనంతరం లక్ష్యసేన్కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అధిక్యాన్ని కాపాడుకున్న శ్రీకాంత్ చివరకు రెండో సెట్ను 21-14తో కైవసం చేసుకున్నాడు. కాగా ఈ సెట్ 21 నిముషాలపాటు సాగింది.
మూడో సెట్లో నువ్వా? నేనా?
తొలి రెండు సెట్లను ఇద్దరు చెరోటి గెలవడంతో ఫలితం కోసం మూడో సెట్ ఆడకతప్పలేదు. దీంతో ఫైనల్లో బెర్తు కోసం కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ నువ్వా? నేనా? అన్నట్టుగా తలపడ్డారు. యువ ఆటగాడైన లక్ష్యసేన్ ఫర్ఫెక్టు షాట్లతోపాటు పట్టువదలకుండా తన దగ్గర ఉన్నా అన్ని టెక్నిక్లతో పోరాడాడు. సీనియర్ ఆటగాడైన కిదాంబి శ్రీకాంత్ తన అనుభవాన్ని ఉపయోగించి ఆడాడు. దీంతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చే చివరి సెట్లో చివరి వరకు ఉత్కంఠ తప్పలేదు. ఓ దశలో ఇద్దరు 16-16తో సమంగా నిలిచారు.
ఈ సమయంలో శ్రీకాంత్కు తన అనుభవం కలిసొచ్చింది. వరుసగా మూడు పాయింట్లు సాధించి అధిక్యంలోకి వెళ్లాడు. చివరి వరకు అధిక్యాన్ని కాపాడుకోని చివరికి సెట్తోపాటు మ్యాచ్ను 21- 17తో గెలుచుకున్నాడు. దీంతో వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తొలిసారి తెలుగు ఆటగాడైన కిదాంబి శ్రీకాంత్ అడుగుపెట్టాడు. చివరిసెట్ ఏకంగా 31 నిముషాలపాటు సాగింది. మొత్తం గంట 9 నిముషాలపాటు సాగిన ఈ మ్యాచ్ను శ్రీకాంత్ 17-21, 21-14, 21-17 తేడాతో గెలుచుకున్నాడు.
కాగా లక్ష్యసేన్ తన పోరాటంతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.కాగా వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2021 విజేతను తేల్చే ఫైనల్ మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రారంభంకానుంది.
ముగ్గురు తెలుగు వాళ్లే
ఇప్పటివరకు వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ముగ్గురు భారత ఆటగాళ్లు అడుగుపెట్టగా ముగ్గురూ మన తెలుగు వాళ్లే కావడం విశేషం. 2015లో తొలిసారి తెలుగు క్రీడాకారిణి సైనా నేహ్వాల్ ఫైనల్ చేరింది. ఆ తర్వాత మరో తెలుగు క్రీడాకారిణి పీవీ సింధు 2017, 2018, 2019లో ఫైనల్ చేరింది. అయితే ఇప్పటివరకు పీవీసింధు మాత్రమే ఒకసారి 2019లో వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచింది. కాగా శ్రీకాంత్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా.