
వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్లో భారత ఆటగాళ్లు చరిత్ర సృష్టించారు. ఈ టోర్నీలో తొలి సారి ఓ భారత ఆటగాడు ఫైనల్ చేరబోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత ఆటగాళ్ల ఉత్తమ ప్రదర్శన సెమీఫైనల్ మాత్రమే. 1983లో ప్రకాశ్ పదుకోణే, 2019లో సాయి ప్రణీత్ ఈ ఘనత సాధించారు. ఆ తర్వాత ఈ సారి పురుషుల సింగిల్స్లో ఏకంగా ఇద్దరు భారత ఆటగాళ్లు సెమీఫైనల్ చేరి రెండు పతకాలు ఖరారు చేశారు. కిదాంబి శ్రీకాంత్తోపాటు 20 ఏళ్ల లక్ష్యసేన్ కూడా సంచలన ప్రదర్శనతో సెమీస్లో అడుగుపెట్టడం విశేషం.
దీంతో ఈ సారి పురుషుల సింగిల్స్లో భారత్కు రెండు పతకాలు ఖాయం అయ్యాయి. అయితే సెమీఫైనల్లో కూడా వీరిద్దరే తలపడనుండడం గమనార్హం. రాత్రి 8:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో వీరిద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్లో అడుగుపెట్టడం ఖాయం. దీంతో భారత్కు ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ కనీసం రజతం ఖాయం అవుతుంది. అప్పుడు ఆ పతకం ఇప్పటివరకు భారత పురుషుల సింగిల్స్లో ఉత్తమ ప్రదర్శన అవుతుంది.

క్వార్టర్స్లో అదరగొట్టిన శ్రీకాంత్, లక్ష్య
కిదాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ తమ తమ క్వార్టర్స్ మ్యాచ్ల్లో ప్రత్యర్థులను సునాయసంగా చిత్తు చేసి సెమీస్లోకి అడుగుపెట్టారు. ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్లో సీనియర్ ఆటగాడు శ్రీకాంత్.. మార్క్ కాల్జౌవ్ను 21-7, 21-8 తేడాతో చిత్తు చేశాడు. మరో క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన జావో జున్ పెంగ్పై 21-15, 15-21, 22-20 తేడాతో లక్ష్యసేన్ విజయం సాధించాడు. 19వ ర్యాంకర్ అయినా లక్ష్యసేన్ ఈ టోర్నీలో పాల్గొన్న తొలిసారే మంచి ప్రదర్శన ఇస్తున్నాడు. తన సహచర ఆటగాడైనా శ్రీకాంత్నే సెమీస్లో ఢీకొట్టబోతున్నాడు. ఈ సందర్భంగా శ్రీకాంత్ను ప్రశసించిన లక్ష్యసేన్.. తన ప్రదర్శన పట్ల కూడా సంతృప్తి వ్యక్తం చేశాడు. శ్రీకాంత్ చాలా బాగా ఆడుతున్నాడని, ప్రత్యర్థులను సింగిల్ డిజిట్కే పరిమితం చేస్తున్నాడని కొనియాడాడు.
ఇప్పటివరకు భారత్కు వచ్చి పతకాలు
వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఇప్పటివరకు భారత్ 10 పతకాలు సాధించింది. ఈ సారి వచ్చే రెండింటితో కలిపి ఈ సంఖ్య 12కు చేరనుంది. ఈ టోర్నీలో భారత్కు తొలిసారి 1983లో పతకం వచ్చింది. ఆ టోర్నీలో ప్రకాష్ పదుకొనె కాంస్యం గెలిచాడు. ఆ తర్వాత 2011లో అశ్విని- పొన్నప్ప జోడి కాంస్యం గెలిచింది. వరుసగా 2013, 2014లో పీవీ సింధు కాంస్యం గెలిచింది. 2015లో సైనా నేహ్వాల్ రజతం గెలిచింది. 2017లో సింధు రజతం, సైనా నేహ్వాల్ కాంస్యం గెలిచారు. ఇక సింధు 2018లో రజతం, 2019లో స్వర్ణం గెలిచింది. 2019లో సాయి ప్రణీత్ కాంస్యం గెలిచాడు. ఈ టోర్నీలో అత్యధికంగా సింధు 5 సార్లు పతకం గెలవడం విశేషం.