హోరాహోరిగా సాగిన మూడో రౌండ్
స్పెయిన్లోని హుయెల్వాలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మూడో రౌండ్లో భారత ఆటగాడైన ప్రణయ్.. డెన్మార్క్కు చెందిన 11వ సీడ్ రాస్మస్ జెమ్కేను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. గంట 16 నిముషాలపాటు హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్లో ప్రణయ్ 16-21, 21-8, 22-20 తేడాతో రాస్మస్ జెమ్కేను ఓడించాడు. ఇద్దరు నువ్వానేనా అన్నట్టు తలపడిన ఈ మ్యాచ్లో ప్రణయ్ మొదటి సెట్ను 16-21తో కోల్పోయినప్పటికీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నారు. రెండో సెట్ను వన్సైడ్గా మార్చేసిన ప్రణయ్ ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా 21-8తో సునాయసంగా గెలుచుకున్నాడు. అనంతరం మ్యాచ్ ఫలితాన్ని తేల్చే మూడో సెట్లో ప్రణయ్, రాస్మస్ జెమ్కే నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డారు. దీంతో ఈ సెట్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. పట్టువదలకుండా పోరాడిన ప్రణయ్ చివరకు సెట్ను 22-20తో గెలుచుకుని మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు. దీంతో క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టిన నాలుగో భారత ఆటగాడిగా ప్రణయ్ నిలిచాడు. క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్.. సింగపూర్కు చెందిన కీన్ యూ లోహ్తో తలపడనున్నాడు. లోహ్ తన మూడో రౌండ్లో థాయ్లాండ్కు చెందిన 16వ సీడ్ కాంటాఫోన్ వాంగ్చారోయెన్ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. కాగా ప్రణయ్ తన తొలి రౌండ్లో హాంకాంగ్ చెందిన ఎనిమిదో సీడ్ అంగస్ ఎన్జీ కా లాంగ్ను, రెండో రౌండ్లో మలేషియాకు చెందిన లీవ్ డారెన్లను ఓడించాడు.
క్వార్టర్స్ చేరిన లక్ష్య, సింధు, శ్రీకాంత్
అంతకుముందు లక్ష్య సేన్, డిఫెండింగ్ ఛాంపియన్ సింధు, కిదాంబి శ్రీకాంత్లు తమ తమ మ్యాచ్లలో వరుస గేమ్లలో గెలిచి క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. 20 ఏళ్ల లక్ష్యసేన్ మూడో రౌండ్లో సునాయసంగా తన ప్రత్యర్థిని ఓడించి క్వార్టర్స్ చేరాడు. కేవలం 32 నిముషాలపాటు సాగిన ఈ మ్యాచ్లో 21-13, 21-8 తేడాతో కెవిన్ కోర్డెన్పై లక్ష్యసేన్ విజయం సాధించాడు. మరో మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ పీవీ సింధు.. థాయ్లాండ్కు చెందిన పోర్న్పావీ చొచువాంగ్ను 21-14 21-18తో ఓడించి క్వార్టర్స్లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ 48 నిముషాలపాటు సాగింది. మరో పురుషుల సింగిల్స్ మ్యాచ్లో 12వ సీడ్ శ్రీకాంత్ 21-10, 21-15తో చైనాకు చెందిన అన్సీడెడ్ గ్వాంగ్ జు లూను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు.
డబుల్స్లో భారత్కు నిరాశ
సింగిల్స్లో భారత ఆటగాళ్లు సత్తా చాటినప్పటికీ డబుల్స్లో మాత్రం నిరాశ తప్పలేదు. ఇటు మహిళల డబుల్స్లో, అటు పురుషుల డబుల్స్లో భారత జోడీలో ప్రీక్వార్టర్స్లోనే ఇంటి దారి పట్టారు. మహిళల డబుల్స్ జోడీ అశ్విని పొన్నప్ప, ఎన్ సిక్కి రెడ్డి జంట 13-21 15-21తో థాయ్లాండ్ జంట జోంగ్కోల్ఫాన్ కితితారాకుల్, రవింద ప్రజోంగ్జై చేతిలో ఓడిపోయారు. అలాగే పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జంట మలేషియాకు చెందిన ఓంగ్ యూ సిన్-టెయో ఈ యి చేతిలో 20-22 21-18 15-21 తేడాతో ఓటమి పాలైంది.