
బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్షిప్లో తెలుగు తేజం పీవీ సింధు చెలరేగుతుంది. వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తాజాగా మూడో రౌండ్లోనూ ప్రత్యర్థిని చిత్తు చేసిన సింధు క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. స్పెయిన్లోని హుయెల్వాలో గల కరోలినా మారిన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో సింధు.. తన థాయ్లాండ్ ప్రత్యర్థిని ఓడించింది. వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో మూడో రౌండ్లో 6వ సీడ్కు చెందిన భారత క్రీడాకారిణి సింధు.. థాయ్లాండ్కు చెందిన 9వ సీడ్ పాన్ పావీ చోచువాంగ్ను 21-14,21-18 తేడాతో ఓడించి క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. 48 నిముషాలపాటు సాగిన ఈ పోరులో సింధు వరుస సెట్లలో గెలుపొందింది. ఈ విజయంతో చోచువాంగ్తో తన వరుస పరాజయాలకు సింధు బ్రేక్ వేసింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్తోపాటు వరల్డ్టూర్ ఫైనల్స్లో చోచువాంగ్ చేతిలో సింధు ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కాగా వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో సింధు ఇప్పటివరకు ఎప్పుడూ క్వార్టర్ఫైనల్కు ముందు ఓడిపోలేదు. వరుసగా ఆరో సారి క్వార్టర్ ఫైనల్ చేరింది.
మ్యాచ్ ప్రారంభం నుంచే చోచువాంగ్పై సింధు అధిపత్యం కనబర్చింది. సింధు ప్రారంభంలోనే 5-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే చోచువాంగ్ మళ్లీ పుంజుకుని గ్యాప్ను 5-4కి తగ్గించింది. అప్పటినుంచి ఇద్దరు కాసేపు హోరాహోరిగా తలపడ్డారు. ఫస్ట్ సెట్లో ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి సింధు 11-9తో అధిక్యంలో నిలిచింది. అనంతరం దూకుడుగా ఆడిన సింధు 15-10,19-11తో అధిక్యాన్ని కొనసాగించింది. చివరకు 21-14తో సింధు ఫస్ట్ సెట్ను కైవసం చేసుకుంది. ఇక రెండో సెట్లో కూడా సింధు ఆరంభంలోనే అధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆరంభంలోనే 3-0తో అధిక్యాన్ని కనబరిచింది. అనంతరం చోచువాంగ్.. సింధు హోరాహోరిగా తలపడ్డారు. మ్యాచ్లో పుంజుకున్న చోచువాంగ్.. సింధు అధిపత్యాన్ని 4-3కు తగ్గించింది. అనంతరం తిరిగి పుంజుకున్న సింధు 7-4తో మళ్లీ అధిక్యంలోకి వచ్చింది. చివరకు సెకండ్ సెట్లో గేమ్ బ్రేక్ సమయానికి సింధు 11-6తో అధిక్యంలో నిలిచింది. గేమ్ బ్రేక్ తర్వాత కూడా సింధు దూకుడు కొనసాగించింది. 17-10తో అధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత చోచువాంగ్ తిరిగి పుంజుకున్నప్పటికీ అప్పటికే అధిక్యంలో ఉన్న సింధు రెండో సెట్ను 21-18తో గెలుచుకోని క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. కాగా సింధు క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్ 1 ర్యాంకర్ తాయ్ ట్జు యింగ్తో తలపడనుంది. కాగా తైవాన్కు చెందిన ఈ ప్లేయర్తో సింధుకు 5-14తో పేలవమైన రికార్డు ఉంది.