
హైదరాబాద్: చైనాలోని నాన్జింగ్ వేదికగా జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో తొలిసారి స్వర్ణ పతకం సాధించాలన్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కల కలగానే మిగిలిపోయింది. ఆదివారం జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కరోలినా మారిన్ చేతిలో 21-19, 21-10 తేడాతో ఓడిపోయింది.
వరల్డ్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో రెండుసార్లు కాంస్యం, ఓసారి రజతం సాధించిన సింధు.. ఈసారి ఎలాగైనా స్వర్ణంతో తిరిగొస్తుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. దీంతో ప్రపంచ ఛాంపియన్ షిప్లో వరుసగా రెండో ఏడాది రెండోస్థానంతో సరిపెట్టుకుంది.
మారిన్తో జరిగిన ఫైనల్లో ఆట ప్రారంభంలో సింధు ఆధిపత్యం ప్రదర్శించింది. ఆరు పాయింట్ల వరకూ నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఇరువురి మధ్య సుదీర్ఘ ర్యాలీలు సాగాయి. ఈ నేపథ్యంలో ఒక అడుగు ముందుకు వేసిన మారిన్ 11-8 పాయింట్లతో సింధును వెనక్కి నెట్టింది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న సింధు తీవ్రంగా పోరాడింది.
ఒకానొక దశలో 17-18 పాయింట్లతో మారిన్పై సింధు పైచేయి సాధించినట్లు కనిపించింది. కానీ, ఈ దశలో మారిన్ అద్భుతంగా పుంజుకుంది. దూకుడుగా ఆడిన మారిన్ వరుసగా ఐదు పాయింట్లను ఖాతాలో వేసుకుంది. 21-19 తేడాతో తొలిగేమ్ను కైవసం చేసుకుంది. ఇక, రెండో గేమ్ను కూడా ఇరువురు బలంగా ప్రారంభించినా, సింధు కాస్త పైచేయి సాధించేలా కనిపించింది.
ఈ క్రమంలో మారిన్ మరో అవకాశం ఇవ్వకుండా సింధును వెనక్కి నెట్టింది. రెండో గేమ్ను 21-10తేడాతో చేజిక్కించుకుంది. ఈ విజయంతో ప్రపంచ ఛాంపియన్షిప్లో మరోసారి సింధుపై మారిన్ విజయం సాధించినట్లైంది. సింధుపై గెలుపోటముల అంతరాన్ని 7-5కు పెంచుకుంది.
అంతేకాదు తాజా విజయంతో మూడోసారి వరల్డ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలుపొందిన తొలి మహిళా షట్లర్గా మారిన్ చరిత్ర సృష్టించింది. 2014, 2015ల్లో స్వర్ణం గెలిచిన మారిన్, తాజా విజయంతో మూడోసారి కూడా పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మలేషియా ఓపెన్లో సింధు చేతిలో ఎదురైన ఓటమికి మారిన్ ప్రతీకారం తీర్చుకుంది.
మరోవైపు కరోలినా మారిన్ చేతిలో ఓడిన సింధు.. వరల్డ్ ఛాంపియన్ సాధించిన తొలి భారత షట్లర్ నిలిచే సువర్ణాకాశాన్ని చేజార్చుకుంది. 2016లో రియో ఒలింపిక్స్లో మారిన్ చేతిలో ఓటమిపాలై రజతంతో సరిపెట్టుకున్న సింధుకు.. మరోసారి అదే తరహా ఫలితం ఎదురైంది.