
భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది. జపాన్లోని టోక్యోలో జరుగుతున్న BWF ప్రపంచ ఛాంపియన్షిప్స్ 2022లో హాంకాంగ్కు చెందిన చియుంగ్ న్గాన్ యిపై మహిళల సింగిల్స్ ఓపెనింగ్-రౌండ్లో గెలుపొందింది. ఈ మ్యాచ్లో పూర్తి ఆధిపత్యం వహించిన సైనా తిరిగి ఫామ్లోకి వచ్చినట్లు కన్పించింది. వరుసగా 21-19, 21-9 సెట్లలో చియుంగ్ న్గాన్ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్ను కేవలం 38నిమిషాల్లోనే సైనా ముగించింది. ఇకపోతే సైనా 2వ రౌండ్ కాకుండా నేరుగా మూడో రౌండ్కు అర్హత సాధించింది. రెండో రౌండ్లోని ఆమె ప్రత్యర్థి అయిన జపాన్కు చెందిన 6వ సీడ్ నోజోమి ఒకుహరా టోర్నమెంట్ నుండి పలు కారణాలతో వైదొలిగింది. దీంతో సైనాకు లైన్ క్లియరైంది. ఆమె 3వ రౌండ్కు బై పొందింది. థాయ్లాండ్కు చెందిన 12వ సీడ్ బుసానన్ ఒంగ్బమ్రుంగ్ఫాన్, జర్మనీకి చెందిన వైవోన్ లీ మధ్య జరిగే రెండో రౌండ్ మ్యాచ్ విజేతతో సైనా మూడో రౌండ్లో తలపడనుంది.
మాజీ కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ మరియు భర్త పారుపల్లి కశ్యప్ కోచ్ బాధ్యతలు వహించగా.. ఆయన కోచింగ్లో సైనా మళ్లీ మునుపటి సైనా చూపించింది. వరుసగా ర్యాలీలలో ఆధిపత్యం చెలాయిస్తూ ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. సైనా కోర్టులో చాలా స్వేచ్ఛగా కదులుతూ కన్పించింది. ఈసారి ఆమె పతక ఆశలు రేపుతోంది. గత కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయిన సైనా పరాజయాలతో సతమవుతుంది. ఇకపోతే ప్రపంచ ఛాంపియన్షిప్స్లో మహిళల సింగిల్స్ విభాగంలో మాళవిక బన్సోద్ తొలి రౌండ్లోనే ఓడిపోవడంతో ఇక సైనా మీదే పూర్తి బాధ్యత నెలకొంది. ఇక 2019 వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ అయిన పీవీ సింధు.. కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతక మ్యాచ్లో గాయపడడంతో ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇకపోతే భారత మహిళల డబుల్స్లో గాయత్రి గోపీచంద్, జాలీ ట్రీసా జోడీ తమ తొలి రౌండ్-మ్యాచ్లో లో యీన్ యువాన్ మరియు వాలెరీ సియోవ్లపై 21-11, 21-13తో విజయం సాధించి రెండో రౌండ్కు అర్హత సాధించారు.