
హైదరాబాద్: చైనాలోని నాన్జింగ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్లో భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ తన జోరుని కొనసాగిస్తున్నాడు. టోర్నీలో భాగంగా శ్రీకాంత్ తన ప్రీ క్వార్టర్స్ మ్యాచ్లో మలేషియాకు చెందిన డారెన్ లివ్తో తలపడనున్నాడు.
ఈ నేపథ్యంలో శ్రీకాంత్ మాట్లాడుతూ డారెన్ లివ్తో గత నాలుగైదు సంవత్సరాలుగా తాను మ్యాచ్ ఆడలేదని, ఈ మ్యాచ్లో మా ఇద్దరి మధ్య పోరు ఎలా ఉంటుందో చూడాలని అన్నాడు. ప్రస్తుతం లివ్ కూడా చక్కగా ఆడుతున్నాడని, ఈ మధ్య కాలంలో అతడు ఆడిన మ్యాచ్లను చూశానని తెలిపాడు.
ప్రీ క్వార్టర్స్ మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని శ్రీకాంత్ తెలిపాడు. కాగా, అన్సీడెడ్ క్రీడాకారుడితో హోరాహోరీగా జరిగిన పోరులో కిదాంబి శ్రీకాంత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. పురుషుల సింగిల్స్లో భాగంగా రెండో రౌండ్లో కిదాంబి శ్రీకాంత్.. స్పెయిన్కు చెందిన పాబ్లో అబియాన్తో తలపడ్డాడు.
ఈ మ్యాచ్లో తొలి గేమ్ను సునాయాసంగా సొంతం చేసుకున్న శ్రీకాంత్కు రెండో గేమ్లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దీంతో కిదాంబి రెండో గేమ్లో ఓటమిపాలయ్యాడు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్లో శ్రీకాంత్ అద్భుతంగా ఆడాడు. మూడో గేమ్లో ఒత్తిడికి గురైన పాబ్లో అనవసర తప్పిదాలకు పాల్పడ్డాడు.
సుమారు గంటా రెండు నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్ 21-15, 12-21, 21-14తో మ్యాచ్ను సొంతం చేసుకుని ప్రి క్వార్టర్స్లో అడుగుపెట్టాడు.