టోక్యోలో జరుగుతున్న BWF ప్రపంచ ఛాంపియన్షిప్స్ 2022లో మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి రెండో రౌండ్లోనే నిష్క్రమించారు. వరుస గేమ్లలో చైనాకు చెందిన చెన్ క్వింగ్ చెన్ మరియు జియా యిఫాన్ల చేతిలో వీరి జోడి పరాజయం పాలైంది. 15-21, 10-21 తేడాతో మ్యాచ్ను వీరు కోల్పోయారు. ఇక 42నిమిషాల పాటు ఈ మ్యాచ్ కొనసాగింది. తొలి సెట్లో అశ్విని, సిక్కి 15-17తో వెనుకబడ్డారు.. ఇక ఆ తర్వాత మళ్లీ ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయారు. వరుసగా 4పాయింట్లు కోల్పోయి సెట్ కోల్పోయారు. అయితే రెండో సెట్లో మాత్రం ధాటిగా ఆరంభించారు. 9-11 వరకు సెట్ హోరాహోరీగా సాగింది. అయితే తర్వాత కేవలం ఒక్క పాయింట్ మాత్రమే సాధించగా.. చైనా జోడీ 10 పాయింట్లతో సెట్ ముగించింది. ఇకపోతే మహిళల డబుల్స్ రెండో రౌండ్లో మాజీ టాప్-50 జోడీ పూజా దండు, సంజన సంతోష్లు కూడా పరాజయం పాలయ్యారు. పూజా, సంజన వరుస గేమ్లలో 15-21, 7-21తో కొరియాకు చెందిన 3వ సీడ్ లీ సో హీ మరియు షిన్ సెయుంగ్ చాన్ చేతిలో ఓడిపోయారు.
నేడు గాయత్రీ గోపీచంద్, జాలీ ట్రీసా జోడీ.. శ్రీలంకకు చెందిన పెర్లీ టాన్, తీనా మురళీధరన్తో గట్టి పోటీని ఎదుర్కోనుంది. పురుషుల డబుల్స్లో.. అర్జున్, ధ్రువ్ కపిల రెండో రౌండ్లో డెన్మార్క్కు చెందిన 8వ సీడ్ కిమ్ ఆస్ట్రప్, అండర్స్ రాస్ముస్సేన్లతో తలపడతారు. భారత బ్యాడ్మింటన్ స్టార్ ద్వయం సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి కూడా ఆ రోజు పోటీలో పాల్గొననున్నారు. ఇక పురుషుల సింగిల్స్లో 12వ సీడ్ కిదాంబి శ్రీకాంత్.. చైనాకు చెందిన అన్సీడెడ్ జావో జున్ పెంగ్తో తలపడబోతున్నాడు. లక్ష్య సేన్ స్పెయిన్కు చెందిన లూయిస్ ఎన్రిక్ పెనాల్వర్తో తలపడతాడు. జపాన్కు చెందిన 2వ సీడ్ కెంటో మొమోటాతో హెచ్ఎస్ ప్రణయ్ పోటీ పడనున్నాడు.