హైదరాబాద్: తెలుగు తేజం.. ప్రపంచ ఛాంపియన్షిప్లో అత్యధికంగా మూడు పతకాలు నెగ్గిన పీవి సింధు టోర్నీని ఘనంగా ఆరంభించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్లో బుధవారం రెండో రౌండ్లో 23 ఏళ్ల సింధు 21-14, 21-9తో ఫిత్రియాని (ఇండోనేషియా)ని ఓడించింది. తొలి రౌండ్లో గేమ్ అంతా సింధువైపే నిలిచింది. తొలి గేమ్లో 11-7తో విరామానికి వెళ్లిన సింధు ఆ తర్వాత వరుసగా ఆరు పాయింట్లు నెగ్గింది. అదే జోరులో గేమ్ నెగ్గింది.
రెండో గేమ్ ఆరంభంలో కాస్త తడబడిన సింధు ఆ తర్వాత పుంజుకుని 11-5తో విరామానికి వెళ్లింది. మ్యాచ్ ఆసాంతం పట్టు వదలకుండా ఆడటంతో.. నిరుడు రజతం నెగ్గిన ఆమె తర్వాతి రౌండ్లో సుంగ్ జి హుయన్ (కొరియా)ను ఢీకొంటుంది. సుంగ్ 2015 ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్యం నెగ్గింది. మరోవైపు సైనా నెహ్వాల్ ఇప్పటికే ప్రిక్వార్టర్స్ చేరింది.
పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్ మూడు గేమ్ల హోరాహోరీ పోరులో 21-15, 12-21, 21-14తో అన్సీడెడ్ పాబ్లో అబియన్ (స్పెయిన్)ను ఓడించాడు. నిరుడు నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లతో చరిత్ర సృష్టించిన శ్రీకాంత్ మూడో రౌండ్లో డారెన్ లివ్ (మలేషియా)తో తలపడతాడు. సాయిప్రణీత్ 21-18, 21-11తో లు ఎన్రిక్ పెనల్వర్ (స్పెయిన్)ను ఓడించి ముందంజ వేశాడు. ప్రిక్వార్టర్స్లో అతడు హన్స్ క్రిస్టియన్ సోల్బర్గ్ విటింఘస్ను ఎదుర్కొంటాడు.
ప్రణయ్ 21-8, 16-21, 15-21తో ప్రపంచ 39వ ర్యాంకర్ కొయెలో (బ్రెజిల్) చేతిలో కంగుతిన్నాడు. సమీర్ వర్మ 17-21, 14-21తో చైనా దిగ్గజం లిన్ డాన్ చేతిలో ఓడిపోయాడు. డబుల్స్లో భారత షట్లర్లు విఫలమయ్యారు. కామన్వెల్త్ క్రీడల్లో రజత పతక విజేత సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ 18-21, 21-15, 16-21తో ప్రపంచ నం.8 కిమ్ ఆస్ట్రప్, ఆండర్స్ స్కారప్ (డెన్మార్క్) చేతిలో, మను అత్రి, సుమీత్ రెడ్డి ద్వయం 24-22, 13-21, 16-21తో ఏడో సీడ్ టకుటో ఇనౌ, యుకి కనెకో (జపాన్) చేతిలో ఓడగా.. మహిళల డబుల్స్లో అశ్విని, సిక్కిరెడ్డి జంట 14-21, 15-21తో రెండో సీడ్ యుకి ఫకుషిమ, సయాక హిరోట (జపాన్) చేతిలో పరాజయంపాలైంది.