
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ కారణంగా టోర్నీలన్నీ వాయిదా పడడంతో క్రీడాకారుల ర్యాంకింగ్స్ను స్తంభింపచేయాలని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) నిర్ణయించింది. మార్చి 17 వరకు ఎవరు ఏ ర్యాంకులో ఉంటే ఆ ర్యాంకులోనే కొనసాగనున్నారు. భవిష్యత్లో జరగబోయే టోర్నీల ఎంట్రీ, సీడింగ్ కోసం మార్చి 17న విడుదల చేసిన తుది ర్యాంక్లను పరిగణనలోకి తీసుకోనున్నట్టు బీడబ్ల్యూఎఫ్ మంగళవారం ప్రకటించింది.
'తదుపరి నోటీసు ఇచ్చే వరకు ప్రపంచ సీనియర్, జూనియర్ ర్యాంకింగ్స్ను ఫ్రీజ్ చేయాలని నిర్ణయించాం. ఆ ఏడాది ఆఖరిగా ఆడిన ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ టోర్నీ తర్వాత షట్లర్లు ఏ ర్యాంకుల్లో ఉంటే వాటిని అలాగే ఉంచుతాం. వాయిదా లేదా రద్దయిన టోర్నీలు మే నెల లేదా జూన్ నెలలో నిర్వహించే ఆలోచన చేస్తున్నాం. మళ్లీ ర్యాంకులను విడుదల చేయడం అనేది టోర్నీల క్యాలెండర్ నిర్ణయమైన తర్వాతే జరుగుతుంది. టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాది జులై 23న ఆరంభం అవుతాయని అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ వెల్లడించిన నేపథ్యంలో ఈ క్రీడల క్వాలిఫికేషన్ పక్రియను సమీక్షిస్తున్నాం' అని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది.
కరోనా వైరస్ కారణంగా ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్, సింగపూర్ ఓపెన్ లాంటి కీలక టోర్నీలను ఏప్రిల్ 12 వరకు వాయిదా వేయాలని సమాఖ్య ఇంతకుముందు నిర్ణయించింది. అయితే టోర్నీల వాయిదాతో ఒలింపిక్స్కు అర్హత సాధించడం కష్టం అవుతుందని భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్, పారుపల్లి కశ్యప్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. కరోనాతో వణికిపోతూ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుంటుంటే.. టోక్యో ఒలింపిక్స్ కోసం ప్రాక్టీస్ కొనసాగించండి అని ఆటగాళ్లను ప్రోత్సహించిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వ్యాఖ్యలపై ఇటీవలే కశ్యప్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఐఓసీ వ్యవహారం చూస్తుంటే.. నవ్వులాటలా కనిపిస్తోందంటూ వ్యంగ్యాస్త్రం విసిరాడు. ఓవైపు ప్రభుత్వం అన్ని శిక్షణా కేంద్రాలను మూసివేస్తే.. శిక్షణను కొనసాగించండంటూ ఐఓసీ చెప్పడంలో అర్థమేంటని కశ్యప్ ప్రశ్నించాడు.