
హైదరాబాద్: ఆదివారం జరిగిన దుబాయి సూపర్ సిరిస్ ఫైనల్స్లో పీవీ సింధు ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం పీవీ సింధు కన్నీరు పెట్టుకుంది. టోర్నీ సాంతం అద్భుత ప్రదర్శన చేసిన పీవీ సింధు ఉత్కంఠగా సాగిన సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి యమగూచి చేతిలో 21-15, 12-21, 19-21 తేడాతో ఓటమి పాలైంది.
ఫైనల్లో విజయం కోసం యమగూచితో తలపడిన ఆమె, శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం ఓ మీడియా సంస్థతో మాట్లాడిన సింధు ఓటమి కంటే, ఓడిన తీరు తనను బాధించిందని ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ పేర్కొంది.
ఇంతటి బాధ తన జీవితంలో ఎన్నడూ కలుగలేదని, మ్యాచ్ తరువాత చాలాసేపు కోలుకోలేకపోయానని, బాధను దాచుకోలేక ఒంటరిగా వెళ్లి ఏడ్చానని చెప్పింది. ఈ మ్యాచ్లో తాను ఎందుకు విజయం సాధించలేకపోయానో అర్ధం కాలేదని, నిర్ణయాత్మక మూడో సెట్లో 19-19 వద్ద ఉన్నప్పుడు ఓడిపోతానన్న బాధ తనకు రాలేదని చెప్పింది.
అయితే అనవసర తప్పులు కూడా చేయలేదని ఈ సందర్భంగా సింధు పేర్కొంది. గెలుపుకోసం తాను ఏం చేయగలనో అంతా చేశానని, చివర్లో చేజార్చుకున్నానని సింధు వ్యాఖ్యానించింది. గెలుపు, ఓటములు సహజమని, ఈ సంవత్సరం తాను ఎక్కువ మ్యాచ్లు గెలిచినందుకు సంతోషంగా ఉందని చెప్పింది.
దుబాయి సూపర్ సిరిస్ ఫైనల్స్ టోర్నీ భాగంగా జరిగిన గ్రూప్ స్టేజిలో యమగూచిపై విజయం సాధించిన సింధు... ఫైనల్లో ఓటమి పాలవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. . పైనల్లో తొలి గేమ్ను 21-15తో సింధు విజయం సాధించింది. అయితే రెండో గేమ్లో అనూహ్యంగా పుంజుకున్న యమగుచి.. వరుసగా పాయింట్లు గెలిచి రెండో గేమ్ను 12-21తో మయగూచి కైవసం చేసుకుంది.
దీంతో నిర్ణయాత్మక మూడో గేమ్ హోరాహోరీగా సాగింది. అందుకు తగ్గట్టుగానే చివరి వరకు పోరు హోరాహోరీగా సాగింది. మూడో గేమ్లో తొలుత సింధు ఆధిక్యంలోకి దూసుకెళ్లినా.. ఆ తర్వాత వెనుకబడింది. ప్రతి పాయింట్ కోసం ఇద్దరు ప్లేయర్స్ తీవ్రంగా శ్రమించారు. ఒకానొక దశలో 19-19తో ఇద్దరూ స్కోర్లు సమమయ్యాయి.
ఆ సమయంలో రెండు వరుస పాయింట్లతో యమగుచి టైటిల్ ఎగరేసుకుపోయింది. దీంతో సింధు రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.