ఢిల్లీ: ప్రతిష్టాత్మక రాజీవ్గాంధీ ఖేల్రత్న అవార్డుకు ఆంధ్రప్రదేశ్ షట్లర్, ప్రపంచ 12వ ర్యాంకర్ కిదాంబి శ్రీకాంత్ పేరును భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) శుక్రవారం సిఫార్సు చేసింది. గతంలో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడిన శ్రీకాంత్ క్షమాపణలు చెప్పడంతో బాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు అర్జున అవార్డుకు తన పేరును సిఫార్సు చేయకపోవడంతో బాయ్పై విమర్శలు గుప్పించిన కేరళ ఆటగాడు, ప్రపంచ 28వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
'ఫిబ్రవరిలో ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ సెమీస్ ఆడకుండా శ్రీకాంత్, ప్రణయ్లు వేరే టోర్నీ కోసం బార్సిలోనా వెళ్లారు. జట్టును వీడొద్దని చెప్పినా వినలేదు. దీంతో పతకం గెలిచే అవకాశం త్రుటిలో చేజారింది. బాయ్కు పంపిన ఈమెయిల్లో శ్రీకాంత్ తన తప్పు ఒప్పుకున్నాడు. భవిష్యత్తులో అలాంటి తప్పు చేయనని చెప్పాడు. ఎన్నో ఘనతలు సాధించిన శ్రీకాంత్ పేరును ఖేల్రత్న అవార్డుకు సిఫార్సు చేశాం' అని బాయ్ కార్యదర్శి అజయ్ సింఘానియా తెలిపాడు.
గత ఫిబ్రవరిలో మనీలాలో జరిగిన ఆసియా టీమ్ ఛాంపియన్షిప్లో భారత జట్టు సెమీఫైనల్కు చేరింది. అయితే సెమీస్ మ్యాచ్ ఆడకుండా శ్రీకాంత్, ప్రణయ్ చివరి నిమిషంలో తప్పుకొని బార్సిలోనాలో మరో టోర్నీ ఆడేందుకు వెళ్లిపోయారు. భారత్ సెమీస్లో పరాజయం పాలై పతకం గెలిచే అవకాశం కోల్పోయింది. దీనిని క్రమశిక్షణారాహిత్యంగా భావిస్తూ 'బాయ్' అవార్డుల కోసం వీరిద్దరి పేర్లను పరిశీలించకుండా పక్కన పెట్టింది. అయితే ఇప్పుడు 'బాయ్' శ్రీకాంత్ను క్షమించేసింది.
అర్జున అవార్డుకు తనను కాకుండా సమీర్ వర్మ పేరును ప్రతిపాదించడంతో అసంతృప్తి చెందిన ప్రణయ్.. 'మళ్లీ అదే పాత కథ' అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై ప్రణయ్ను వివరణ కోరినట్లు సింఘానియా చెప్పారు. 'గతంలోనూ ప్రణయ్ ఇలాగే చేశాడు. కానీ మేం చూసీ చూడనట్లు వదిలేశాం. ఈసారి మాత్రం అతని ప్రవర్తన మాకు ఆగ్రహం తెప్పించింది. అందుకే షోకాజ్ నోటీసు జారీ చేశాం. సంతృప్తికర సమాధానం ఇస్తే సరి. లేదంటే అతనిపై గట్టి చర్యలు తీసుకుంటాం' అని స్పష్టం చేశారు.
ఐపీఎల్ వాణిజ్య ఒప్పందాలపై బీసీసీఐ సమీక్ష!!