న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ప్రభావం క్రీడారంగంపై ఇంకా కొనసాగుతూనే ఉంది. భారత దేశంలోనూ కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుండడంతో.. జులై వరకు ఎటువంటి బ్యాడ్మింటన్ టోర్నీలూ నిర్వహించబోమని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది. టోర్నీ ఆతిథ్య సంఘాలతో, ఆయా దేశాల సమాఖ్యలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీడబ్ల్యూఎఫ్ తెలిపింది.
కరోనా ఎఫెక్ట్.. ఢిల్లీ షూటింగ్ ప్రపంచకప్ రద్దు!!
మే-జులై నెలలో జరగాల్సిన అంతర్జాతీయ, జూనియర్, పారా టోర్నమెంట్స్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని సోమవారం బీడబ్ల్యూఎఫ్ ప్రకటించింది. దీంతో హెచ్ఎస్బీసీ బీడబ్ల్యూఎఫ్ టూర్, బీడబ్ల్యూఎఫ్ టూర్, ఇండోనేషియా ఓపెన్ టోర్నీతో సహా గ్రేడ్-2, గ్రేడ్-3 ఈవెంట్లు వాయిదాపడ్డాయి. 'ప్రపంచ వ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో టోర్నమెంట్స్ను నిలిపివేశాం. ఆటగాళ్ల ఆరోగ్యం, భద్రత, శ్రేయస్సు ముఖ్యం' అని బీడబ్ల్యూఎఫ్ పేర్కొంది.
గ్రేడ్-2 అంతర్జాతీయ టోర్నమెంట్స్లో ఆస్ట్రేలియా, థాయ్లాండ్, ఇండోనేషియా, రష్యన్ ఓపెన్ టోర్నీలు ఉన్నాయి. కరోనా ప్రభావంగా టోర్నీలన్నీ వాయిదా పడడంతో.. క్రీడాకారుల ర్యాంకింగ్స్ను ఇటీవల బీడబ్ల్యూఎఫ్ స్తంభింపచేసిన సంగతి తెలిసిందే. మార్చి 17 వరకు ఎవరు ఏ ర్యాంకులో ఉంటే.. ఆ ర్యాంకులోనే కొనసాగనున్నారని ఇటీవలే తెలిపింది.
మరోవైపు కరోనా ప్రభావంతో షూటింగ్ ప్రపంచకప్నూ రద్దు చేశారు. ఢిల్లీ వేదికగా మే-జూన్లో జరగాల్సిన షూటింగ్ ప్రపంచకప్ను రద్దు చేస్తున్నట్లు ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) తెలిపింది. షెడ్యూల్ ప్రకారం మార్చి 15-26న జరగాల్సిన ఈ టోర్నీని మే-జూన్కు వాయిదా వేశారు. మే 5-12న రైఫిల్/పిస్టల్, జూన్ 2-9న షాట్గన్ పోటీలు జరగాల్సి ఉంది. కానీ..ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రపంచకప్ను రద్దు చేస్తున్నట్లు ఐఎస్ఎస్ఎఫ్ ప్రకటించింది.